ఈ ఐదేళ్ళుగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వీర విధేయంగా మెసులుకున్నారు. తద్వారా తన అక్రమస్తుల కేసుల వలన ఇబ్బంది లేకుండా తప్పించుకోగలిగారు.
ఆయనకు మోడీ, అమిత్ షాల ఆశీర్వాదాలు ఉన్నందునే 5 ఏళ్ళు అరాచక పాలన సాగించగలిగారు. లేకుంటే ఎప్పుడో గద్దె దిగాల్సి వచ్చేది. లక్షల కోట్లు అప్పులు తెచ్చుకోగలిగారు.
మోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని పక్కన పడేసినా కేంద్రం పట్టించుకోలేదు. పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నా పట్టించుకోలేదు. ఏది ఏమైతేనేమి 5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా గడిచిపోయింది.
ఇప్పుడు టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి కాస్త ఇబ్బందిగానే ఉంది కానీ దాని వలన వైసీపికి పెద్ద సమస్యేమి ఉండదని ఈ నెల రోజులలో ఏపీలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను చూస్తే అర్దమవుతుంది.
కనుక జగన్, వైసీపి నేతలు ఎవరూ కూడా బీజేపీని, మోడీ, అమిత్ షాలను పల్లెత్తు మాట అనకుండా, తమ ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మీదే పెట్టి పనిచేసుకుపోతున్నారు.
టిడిపి, జనసేనలతో బీజేపీ కలిసి పోటీ చేస్తోంది కనుక మోడీ, అమిత్ షా ఇద్దరూ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ముందుగా వచ్చిన అమిత్ షా నేడు ధర్మవరంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొని చంద్రబాబు నాయుడుపై ప్రశంశలు, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కురిపించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెడితే, సరిగ్గా ఐదేళ్ళలోనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారని విమర్శించారు. ఈ 5 ఏళ్ళలో జగన్ రూ.13.50 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని అమిత్ షా విమర్శించారు.
కానీ జగన్ ఈవిదంగా చేయగలడానికి తామే కారణమని అమిత్ షాకు తెలుసు. కనుక జగన్పై ఇటువంటి విమర్శలు చేస్తే, ‘మరి మీరెందుకు అడ్డుకోలేదు?ఎందుకు అప్పులు ఇప్పించారు?” అని తిరిగి జగన్ లేదా వైఎస్ షర్మిల అడిగితే సమాధానం చెప్పుకోలేరు.
కనుక ఈసారి టిడిపి, జనసేనలతో కలిసి బీజేపీ పోటీ చేస్తోందనే విషయం ప్రజలకు తెలియజేయడం కోసమే మోడీ, అమిత్ షాలు జగన్పై విమర్శలు చేస్తున్నట్లు భావించవచ్చు. కానీ వాటి వలన రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు. వారి విమర్శలను ప్రజలు నమ్మబోరు కూడా.
కనుక కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరపున ఏమి చేస్తారో వారిరువురూ విస్పష్టమైన హామీలు ఇస్తే, ప్రజలకు కొంతలో కొంత మోడీ, అమిత్ షా మాటలపై నమ్మకం ఏర్పడుతుంది. ఇలాంటి ఊక దంపుడు ప్రసంగాలకు ఆంద్రా ప్రజలు పడరని గ్రహిస్తే మంచిది.






