నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయ నేతలలో ఒకరైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత టిడిపిలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అవి నిజమే అని భావించవచ్చు.
శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ వెళ్ళి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు. వారిద్దరూ సుమారు మూడు గంటలసేపు నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకొన్నాక ఆయన నెల్లూరు తిరిగి వచ్చేశారు.
ఈరోజు ఉదయం నెల్లూరులోని టిడిపి నేతలు ఆయన నివాసానికి వెళ్లారు. వారితో కలిసి ఆయన అల్పాహారం చేసి అందరూ కలిసి టిడిపి కార్యాలయానికి బయలుదేరివెళ్ళారు. అంటే ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలో చేరడం ఖాయం అయ్యిందని స్పష్టమవుతోంది.
ఇంతకాలం నియోజకవర్గంలో వైసీపీ, టిడిపిలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా ఘర్షించుకొనేవారు. కానీ ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలో చేరబోతుండటంతో అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇది అంత సులువు కాదు. కనుక ముందుగా ఈరోజు ఆత్మకూరుకు చెందిన టిడిపి, వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వారి సమక్షంలో చేతులు కలుపుకొని, అందరూ కలిసి కూర్చొని తమ మద్య ఉన్న సమస్యలను, విభేధాలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తారు.
ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజకవర్గంలోని అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై టిడిపిలో చేరే విషయం గురించి చర్చించుకొని తుది నిర్ణయం తీసుకొంటారు. టిడిపి యువనేత నారా లోకేష్ ఈ నెల 12వ తేదీన నెల్లూరులో ప్రవేశించి యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. కనుక ఆ సమయంలోనే నారా లోకేష్ సమక్షంలో ఆనం రామనారాయణ రెడ్డి, అనుచరులు టిడిపిలో చేరవచ్చు.
ఒకవేళ ఎన్నికల వరకు అనర్హత వేటు పడకూడదని ఆనం రామనారాయణ రెడ్డి భావిస్తే, టిడిపిలో చేరకుండా నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీగా జనసమీకరణ చేసి అట్టహాసంగా బహిరంగసభ ఏర్పాటు చేసి దానిలో పాల్గొనవచ్చు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టిడిపిలో చేరడం ఖాయమే కానీ ఎన్నికల ముందు చేరాలని భావిస్తున్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం టిడిపిలో చేరే ఆలోచన ఉన్నట్లు ఇంకా ఏమీ మాట్లాడలేదు.
—



