రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పందిర్లు వెలుస్తున్నాయి. ఇంకా అయిదు రోజుల సమయం ఉండగానే… రహదారుల్లో పండగ వాతావరణం నెలకొంటోంది. ఈ శుక్రవారం నాడు రానున్న తొలి పండగ మహా గణపతిని పూజించుకోవడానికి ప్రజలు కూడా సన్నద్ధం అవుతున్నారు. అయితే ‘వినాయకచవితి’ పర్వదినం అని చెప్పుకోగానే, ఖైరతాబాద్ గణేషుని విగ్రహం ఎలా ఉంది? మరియు బాలాపూర్ లడ్డు ధర ఈ ఏడాది ఎంత పలికింది? అన్న రెండు ప్రశ్నలు మదిలో కలగడం సహజమే.
బాలాపూర్ లడ్డు ధర నిమజ్జన సమయంలో తేలేది గనుక, దానికి చాలా సమయం ఉంది. ఇక ఖైరతాబాద్ గణేష్ ఎలాంటి రూపు సంతరించుకోబోతున్నాడు? అన్న ఆసక్తికి ‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ బదులిచ్చింది. ఈ ఏడాది గణపతి ‘ఇదిగో… ఈ విధంగా ఉండబోతున్నాడు…’ అంటూ ఖైరతాబాద్ గణేషుని విగ్రహం ‘ఫస్ట్ లుక్’ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లీక్ చేసింది. ఓ పక్కన తండ్రి శివయ్యను పెట్టుకుని వినాయకుల వారు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నారన్న విషయం ఈ ఫోటో చెప్పకనే చెప్పింది.


