ఆంధ్రా యువత దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, పూణే వంటి ఇతర నగరాలకు, అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు వలసలు వెళుతున్నారు.
ఓ మూడు నాలుగు దశాబ్దాల క్రితం దేశం ఇంతగా అభివృద్ధి చెందలేదు. ఇన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు కనుక నాడు యువత వలసలు వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినా ఈ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా నుంచి వలసలు పెరిగాయి. వైసీపీ హయంలో ఈ వలసలు మరింత పెరిగాయి.
దీని వలన వృద్ధులైన తల్లితండ్రులు పిల్లల వెంట దేశవిదేశాలకు వెళ్ళలేక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది వృద్ధాప్యంలో ఒంటరి జీవితాలు గడుపుతున్నారు.
అయితే రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం పైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది తప్ప ఈ సమస్యపై పెద్దగా చర్చ జరుగదు.
మంత్రి నారా లోకేష్ గతంలో సీమ జిల్లాలలో యువగళం పాదయాత్ర చేస్తున్నపుడు అక్కడి ప్రజలతో ముఖాముఖి సంభాషణలలో ఈ సమస్యని కూడా గమనించారు. దీని తీవ్రతని గుర్తించారు.
అందుకే సీమ జిల్లాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే జాబ్ క్యాలండర్ ప్రకటించి దాని ప్రకారం ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయిస్తున్నారు.
శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో కూడా ఇదే చెప్పారు.
“ఇప్పుడు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వోద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నాము.
కనుక నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు వెళ్ళవద్దు. మన రాష్ట్రంలోనే అమరావతి, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలలో అందుబాటులోకి వస్తున్న ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నాను,” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఆయన చెప్పిన ఈ మాటలు అక్షరాల నిజమని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.
అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూరప్ వంటి దేశాలలో ఉన్నత విద్యలు లేదా ఉద్యోగాలకు వెళ్ళాలనుకునే యువత, వాటికి సంబంధించి విషయ సేకరణ చేసి, తగిన నైపుణ్యాలు సంపాదించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని వెళ్తుంటారు.
అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏయే ప్రాంతాలలో ఏయే పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయి? అభివృద్ధి పనులలో ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి? ఆయా పరిశ్రమలలో ఉద్యోగాలకు ఎటువంటి చదువులు, నైపుణ్యం అవసరం?
అక్కడి స్థానిక పరిస్థితులు ఏవిధంగా ఉంటాయి? వంటి విషయాల గురించి యువత అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన శిక్షణ పొందితే మంత్రి నారా లోకేష్ చెప్పినట్లు ఆంధ్రా యువత పొట్ట చేత్తో పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, పరాయి దేశాలకు వలసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
రాబోయే రోజుల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఆంధ్రా యువత వలసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాటి కోసం ఇతర రాష్ట్రాల నుంచే నిరుద్యోగులు ఆంధ్రాకు వలసలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు వారితో కూడా ఆంధ్రా యువత పోటీ పడాల్సి ఉంటుంది కనుక ఇప్పటి నుంచే నైపుణ్యాలు పెంచుకోవడంపై దృష్టి సారించడం చాలా అవసరం.




