విభజన హామీలు… ఎవరికి ఉపయోగపడ్డాయి?

ys-sharmila-reddy-congress

ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు రాష్ట్రాలకు అనేక హామీలు ఇచ్చేసింది. వాటిలో చాలా వరకు విభజన చట్టంలో చేర్చగా, ఏపీకి ప్రత్యేక హోదా వంటివి నోటి మాటగా హామీలు ఇచ్చింది.

విభజన సమయంలో ఉన్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని, కానీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ అధిష్టానానికి ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఆంధ్రాకు అన్యాయం చేయడం లేదని చెప్పుకునేందుకు విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చింది.

ADVERTISEMENT

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండుగా విడగొట్టినప్పటికీ తెలంగాణకు కూడా విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చింది.

కాంగ్రెస్‌ ఊహించిన్నట్లే ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కానీ దాంతో పాటు తెలంగాణలో కూడా ఓడిపోయింది. ఆ తర్వాత కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని దాదాపు ఖాళీ చేసేశారు. ఆ తర్వాత విభజన హామీలు, విభజన సమస్యల వలన వివాదాల గురించి, రెండు రాష్ట్రాలు ముందుకు సాగిన తీరు అందరికీ తెలుసు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ హామీలలో వాటిలో కొన్నిటిని అమలుచేసింది. ప్రత్యేక హోదా వంటి కొన్నిటిని తీసి పక్కన పడేసింది.

ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఇన్ని హామీలు ఇచ్చినా అవేవీ ఆ పార్టీకి ఇన్నేళ్ళుగా ఉపయోగపడనే లేదు. కానీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి.

రాష్ట్ర విభజన చేసినందుకు ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఇంతకాలం ప్రజలకు మొహాలు కూడా చూపలేని దుస్థితిలో ఉన్నారు. కానీ ఆనాడు విభజన చట్టంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలే ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఏపీలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పక తప్పదు.

కేంద్రంలో కాంగ్రెస్‌ మళ్ళీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందో రాదో ఆమెకు కూడా తెలీదు. ఒకవేళ వచ్చినా ఆ విభజన హామీలు అమలు చేయలేదని మాత్రం ఖచ్చితంగా తెలుసు. కానీ వస్తే అమలుచేస్తాం అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణలో ఇదివరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతీ ఎన్నికల సమయంలో విభజన హామీలను అటక మీద నుంచి కిందకు దింపి వాటితో బీజేపీని నీలదీయడానికి ఉపయోగించుకుంటున్నాయి.

రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన జైరాం రమేష్ వంటి సీనియర్ నేతలు ఎన్నికలప్పుడు విభజన హామీల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత లబ్ధి కలిగించుకుంటున్నారు.

రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తేరుకునేందుకు ఇచ్చిన విభజన హామీలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకపోయినా, రాజకీయ పార్టీలకు మాత్రం నేటికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయన్న మాట!

ADVERTISEMENT
Latest Stories