ఏపీ బిజెపికి గ్రీన్ సిగ్నల్‌ ఎప్పుడు పడుతుందో?

somu verraju said no alliance between tdp and bjpఏ రాష్ట్రంలోనైనా రాజకీయ పార్టీలు నిత్యం చైతన్యంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా తమ వైఖరి లేదా విధానాల పట్ల పూర్తి స్పష్టత చాలా అవసరం. ఏపీలో వైసీపీ, టిడిపి, జనసేనలకు ఖచ్చితమైన విధానాలున్నాయి. అయితే బిజెపితో ఉండాలో టిడిపితో పొత్తులు పెట్టుకోవాలో జనసేన ఇంకా తేల్చుకోవలసి ఉంది.

ADVERTISEMENT

ఇక జాతీయ పార్టీ అయిన బిజెపికి ఏపీ గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో భవిష్యత్‌ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొనే జగన్ ప్రభుత్వం పట్ల మోడీ ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందనేది బహిరంగ రహస్యం. కనుక ఢిల్లీ పెద్దలే ఏపీ బిజెపి నేతల కాళ్ళు చేతులను కట్టేశారని భావించవచ్చు. బహుశః అందుకే ఏపీ బిజెపిని జనసేనతో కలిసి జగన్ ప్రభుత్వంతో పోరాడేందుకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంలేదని భావించవచ్చు.

కానీ ఏపీ బిజెపి నేతలు తమ ఉనికిని చాటుకోవడం కోసం రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తుంటే, జగన్ ప్రభుత్వం పట్ల మోడీ ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తుంటుంది. పలు కేసులు, అప్పులు, ఆర్ధిక, రాజకీయ అవసరాలు ఉన్నందున సిఎం జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు కూడా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు విధేయంగానే వ్యవరిస్తుంటారు.

ఏపీ బిజెపి నేతలు అమరావతే రాజధాని అని చెపుతుంటే, మూడు రాజధానులంటూ నాలుగేళ్ళుగా కాలక్షేపం చేసేస్తున్న సిఎం జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అమరావతి పనులు మొదలుపెట్టాలని చెప్పరు.

హిందుత్వ విధానంతో బిజెపికి ఏపీలో హిందువుల మతమార్పిడులు, హిందూ ఆలయాలపై దాడులు, దొంగతనాలు, అపచారాలపై స్పందించదు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఇతర మతాలకు, ఇతర పనులకు వినియోగిస్తుంటే స్పందించదు. అంటే వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న రాజకీయ అస్త్రాలను కూడా ఏపీ బిజెపి వినియోగించుకోలేకపోతోందని అర్దమవుతూనే ఉంది.

పైగా ఢిల్లీ పెద్దలు ఓసారి పవన్‌తో, ఓసారి జగన్‌తో, మరోసారి చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతుంటారు. దాంతో వారు ఏదో పెద్ద రాజకీయ వ్యూహమే రచిస్తుండవచ్చు కానీ ఏపీ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నట్లవుతోంది. దీని వలన నష్టపోయేది ఏపీ బిజెపియే తప్ప టిడిపి, వైసీపీ, జనసేనలు కావు.

అయితే ఏపీలో బిజెపి కొత్తగా నష్టపోయేందుకు ఏమీ లేదు కనుక ఏవిదంగా వ్యవహరించినా పర్వాలేదనే ధీమాతో ఉన్నట్లుంది. ఇటువంటి ఆలోచన ఏ రాజకీయపార్టీకైనా శాపంగానే మారుతుంది.

త్వరలోనే అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఏపీలో వేర్వేరు బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. కనుక కనీసం అప్పటికైనా వారు స్పష్టత ఇస్తారని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories