ప్రముఖ ఆర్ధిక నిపుణుడు డా.జీవీ రావు ఇటీవల ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇదేవిదంగా అప్పులు చేసుకొంటూపోతే, ఏదో ఓ రోజు రాష్ట్రం కుప్పకూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయని, కానీ అవన్నీ మౌలికవసతుల కల్పన, ప్రాజెక్టుల నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి కోసం వినియోగిస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం రోజువారీ ఖర్చుల కోసం, ఉద్యోగుల జీతాల కోసం అప్పులు చేస్తోందని, ఇది ఎంత మాత్రం సరైన విధానం కాదని డా.జీవీ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తోందని అన్నారు. మళ్ళీ అంతకు రెట్టింపు భారం ప్రజలపైనే వేస్తోందన్నారు. అంటే ఓ చేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో పది రూపాయలు తీసుకొంటున్నట్లు చెప్పవచ్చని డా.జీవీ రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల పేరుమీద కూడా ఎడాపెడా అప్పులు చేస్తోందని, అన్నిటినీ కలుపుకొంటే దాదాపు రూ.10 లక్షల కోట్ల వరకు అప్పులు పేరుకుపోయాయని, ఇంత అప్పు ఏ రాష్ట్రానైనా క్రుంగదీసి కూల్చివేస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్, శ్రీలంక దేశాలు కూడా ఇలాగే గొప్పలకు పోయి అప్పులు చేసి ఆ ఊబిలో కూరుకుపోయాయని గుర్తు చేశారు. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా ప్రమాదమని డా.జీవీ రావు అభిప్రాయం వ్యక్తం చేసారు.
సిఎం జగన్ ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ నేడు (సాక్షి)మీడియా ముందుకు వచ్చి డా.జీవీ రావు వాదనలను ఖండించారు. గత నాలుగేళ్లుగా ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉన్నాయని అన్నారు. దానిలో భాగంగానే ఈనాడు మీడియా ఊరూపేరూ తెలీని డా.జీవీ రావుని పట్టుకువచ్చి రాష్ట్రం దివాళా తీస్తోందని చెప్పించిందని కృష్ణ ఆరోపించారు.
డా.జీవీ రావుకు ప్రభుత్వం-రిజర్వ్ బ్యాంక్ లేదా ఇతర ఆర్ధిక సంస్థల మద్య జరిగే ఆర్ధికలావాదేవీల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడారని కృష్ణ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీస్తోందని, ప్రభుత్వం అనాలోచితంగా అప్పులు చేస్తూ ప్రజలపై ఆర్ధిక భారం మోపుతోందని చెపుతూ రాష్ట్ర ప్రజలలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాటా రూ. 1.19 లక్షల కోట్లు అప్పులు రాగా, 2019లో టిడిపి ప్రభుత్వం పాలన ముగిసేసరికి అది రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందని కృష్ణ చెప్పారు. ఈ నాలుగేళ్ళ వైసీపీ పాలనలో అది రూ.4.42 లక్షల కోట్లకు పెరిగిందని, ఇవికాక మరో రూ.1.45 లక్షల కోట్లు అప్పులు తెచ్చుకొనేందుకు ప్రభుత్వరంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని అన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొన్న అప్పులు కలిపితే మొత్తం రూ.5.85 కోట్లు అప్పులున్నాయని కృష్ణ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి పధకాల కోసం ఖర్చు చేస్తోందనే వాదనపై స్పందిస్తూ, ప్రభుత్వం పాఠశాలలలో మౌలికవసతుల కల్పన, విద్యావ్యవస్థని అభివృద్ధి చేయడానికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చేస్తున్న ఖర్చులని వృధా ఖర్చులుగా లెక్కగట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తెస్తున్న ప్రతీ రూపాయికి సంబందించి పూర్తి వివరాలు ఆన్లైన్లో చూడవచ్చని, అప్పులు చేసి దాచి పెట్టుకోవలసిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు దువ్వూరి కృష్ణ.
అంటే ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంది. నిబందనలకు, ఆర్ధిక స్తోమతకు లోబడే అప్పులు తెచ్చుకొంటున్నాము. దాంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయే తప్ప రాష్ట్రం దివాళా తీయదని కృష్ణ చెప్పారనుకొంటే, మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెల నెలా ప్రభుత్వం ఎందుకు జీతాలు చెల్లించలేకపోతోంది?ఉద్యోగులు దాచుకొన్న సొమ్ముని తీసి ఎందుకు వాడేసుకొంది? కాంట్రాక్టర్లకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదు?
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పక్కదారి పట్టిస్తోంది? ఆస్తిపన్ను, ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచేస్తోంది?ముఖ్యమంత్రి స్వయంగా మంజూరు చేసిన పనులకు కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఎందుకు దాపురించింది?ఇలా అనేక ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవలసి ఉంది. కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి ఓ ఆర్ధిక నిపుణుడు మాట్లాడిన మాటలను కూడా ప్రతిపక్షాల దుష్టరాజకీయాలే అని మరో ఆర్ధిక నిపుణుడు చేత చెప్పించడం సిగ్గుచేటు!



