డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు చేస్తున్న వైసీపీకి శాసనసభ, మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం లభించింది. కానీ జగన్ టీమ్ ఎప్పటిలాగే సమావేశానికి మొహం చాటేయడంతో, ఆ అవకాశం కోల్పోయింది.
కనీసం మండలికి వైసీపీ సభ్యులు వచ్చి నిలదీస్తున్నారు కదా.. అనుకుంటే వారు సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తర సమయంలో డీఎస్సీపై చర్చ కోసం పట్టుబడుతూ ఆందోళనలు చేస్తున్నారు. తద్వారా మండలిలో కూడా దీనిపై చర్చ జరుగకుండా వారే అడ్డుపడుతున్నట్లవుతోంది.
దీనిపై వైసీపీ సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెపుతున్నప్పుడు, వైసీపీ ఎమ్మెల్సీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సభ సజావుగా జరిగేలా చేసి, మంత్రి చేత సమాధానాలు చెప్పించి ఉండాలి. కానీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కూడా చేజేతులా వారే వదులుకుంటున్నారు.
సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు వారిని సస్పెండ్ చేసి బయటకు పంపించేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ చైర్మన్ మోషేను రాజుని కోరారు. బహుశః అలా జరగాలనే వైసీపీ సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది.
డీఎస్సీ విషయంలో మంత్రి నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలనేది వైసీపీ వ్యూహమైనప్పుడు, అందుకు తగినట్లు సభలో వ్యవహరించాలి కదా? కానీ సస్పెన్షన్ వేటు వేయించుకొని బయటపడి, డీఎస్సీపై చర్చించడానికి ప్రభుత్వం భయపడి, తమని బయటకు పంపించిందని ఎంత గట్టిగా వాదించి ఏం ప్రయోజనం? డీఎస్సీ విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి లేకపోతే పాయె. కనీసం మండలిలో అనుసరించాల్సిన వ్యూహం విషయంలో కూడా చిత్తశుద్ధి లేకపోతే ఎలా? ఎవరికి నష్టం?





