రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను చూసినవారికి తెలంగాణలో అభివృద్ధి, ఆంధ్రాలో రాజకీయాలు, సంక్షేమ పధకాలు కనిపిస్తాయి.
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కొంత అభివృద్ధి పనులు జరిగినప్పటికీ, కొన్ని తప్పుడు నిర్ణయాలకు, రాజకీయాలకు ఆయన మూల్యం చెల్లించుకుని దిగిపోవలసి వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షేమ రాజ్యంగా మార్చేశారు. ఇదంతా అందరికీ తెలిసిందే.
ఈ పదేళ్ళలో చంద్రబాబు, జగన్ ఇద్దరి పాలనలను ప్రజలు చూశారు. అనుభవించారు. కనుక ఇప్పుడు ఇద్దరిలో ఎవరైతే రాష్ట్రానికి మంచిదనే ఆలోచన అందరికీ కలిగే ఉంటుంది.
కనుక ఈ ఎన్నికలను టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి, వైసీపికి మద్య లేదా కొన్ని సామాజిక వర్గాలకు మద్య జరుగుతున్న ఆధిపత్య పోరుగానో చూడటం కంటే ఇవి చంద్రబాబు నాయుడు పాలనకి, జగన్మోహన్ రెడ్డి పాలనలకు రిఫరెండంగానే చూసి ప్రజల తీర్పు చెప్పాల్సి ఉంటుంది.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది. ఆ నష్టం నుంచి పూర్తిగా తేరుకోవలసిన ఈ 10 ఏళ్ళ సమయంలో రాష్ట్ర రాజకీయాలలో రెండు రాజకీయ ప్రయోగాలు జరిగాయి. ఒకటి అభివృద్ధితో మరొకటి సంక్షేమంతో జరిగాయి. రెంటి ఫలితాలను ప్రజలు చూశారు. అనుభవిస్తున్నారు కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే 5 ఏళ్ళలో తప్పనిసరిగా ఎంతో కొంత అభివృద్ధి చెందాలి. లేకుంటే రాష్ట్ర ప్రజలందరూ అనాధల్లా, నిర్వాసితుల్లా, శరణార్దుల్లా… ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోక తప్పదు.
ఈ 5 ఏళ్లలోనే రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లభించక లక్షల మంది యువత, రైతులు, కార్మికులు పొట్ట చేత్తో పట్టుకొని ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోయారు.
రాష్ట్రంలో ప్రతీ నగరం, పట్టణం గ్రామంలో చివరికి ప్రతీ 10 కుటుంబాలలో వలసలు పోయినవారున్నారు. కనుక ఈ వలసలు ఇక్కడితో ఆపాలనుకుంటే రాష్ట్రానికి రాజధాని నిర్మించి, పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకువచ్చి, ప్రాజెక్టులు పూర్తిచేసి పంటలకు సాగునీరు అందించి వ్యవసాయాభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నవారికే ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తమని తాము గెలిపించుకోవాలి.
కాదని మరోసారి ‘మేలు’ కోరుకుంటే ఆ మేలుకు బదులు ఎవరూ ఊహించలేనంత కీడు, విధ్వంసం జరుగుతుంది. పార్టీలు, కులాలు, ప్రలోభాలను అన్నిటినీ పక్కన పెట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గెలిపించుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞతని నిరూపించుకుందాము.






