ప్రభుత్వ సలహాదారుడిగా వచ్చి, వైసీపీ ప్రభుత్వానికి సకలశాఖ మంత్రిగా ఏపీలో పేరుసంపాదించుకున్న సజ్జల రామకృష్ణా రెడ్డి రోజుకో సారి మీడియా ముందుకు రావడం టీడీపీ పార్టీ విధానాలను తప్పుబట్టడం తద్వారా వైసీపీ వైఖరిని ప్రజలలో చర్చకుంచడం పరిపాటుగా మారిపోయింది.
చంద్రబాబు అరెస్టైన నాటి నుంచి అయన మీడియా ముందుకొచ్చి టీడీపీ ని విమర్శిస్తున్న ప్రతి సందర్భంలోను జగన్ ప్రస్తావన ప్రజలలో చర్చకొస్తుంది. చంద్రబాబు తప్పు చేసాడు కాబట్టే జైలుకు వెళ్ళాడు…అన్నారు దీనికి అయితే జగన్ కూడా తప్పుచేసాడు కాబట్టే అరెస్టయ్యి జైల్లో ఉన్నాడు అంటూ జగన్ గతం గురించి రాష్ట్రమంతా చర్చ జరిగింది.
తరువాత బాబు అక్రమాలకు పాల్పడ్డాడు అందుకే న్యాయస్థానాలు ఇంకా బెయిలు ఇష్యూ చేయలేదంటూ బాబు అరెస్టైన పది రోజులకే విమర్శలు మొదలెట్టారు. ఓహో..జగన్ అందుకే బెయిలు రాకుండా 16 నెలలు జైలు జీవితం గడిపాడంటూ మరోసారి జగన్ ప్రస్తావన చర్చకొచ్చింది. ఇక బాబుకు మధ్యంతర బెయిలు జారీ అయ్యి బయటకు వస్తే ఆయన వయస్సుని, అనారోగ్య సమస్యలను అవహేళన చేస్తూ బాబు పై విమర్శలు మొదలుపెట్టారు సజ్జల.
న్యాయస్థానాలకు కుంటి సాకులు చెపుతూ జగన్ తన మీద జరిగిన కోడి కత్తి కేసు విచారణకు కూడా హాజరుకాలేకపోవడానికి కారణాలపై రకరకాల మీమ్స్ తయారయ్యాయి సోషల్ మీడియాలో.నిన్న స్కిల్ కేసులో బాబుకి రెగ్యులర్ బెయిలు మంజూరు చేయడంతో కోర్టుల తీర్పులను సైతం తప్పుబట్టడానికి వెనుకడుగు వేయలేదు సజ్జల.అయితే గతంలో జగన్ కు బెయిలు రావడానికి,ప్రస్తుతం 10 సంవత్సరాల నుంచి బెయిలు మీద బయట తిరగడానికి కారణం కూడా కోర్ట్ తప్పిదాలేనా? అంటూ సజ్జల జగన్ జైలు – బెయిలు జీవితాన్ని ఈ రెండు నెలలపాటు రాష్ట్రంలో చర్చలో ఉంచగలిగారు.
తాజాగా నేడు మరో అంశంతో టీడీపీ పార్టీని ఇరుకునపెట్టాలని మీడియా ముందుకు వచ్చిన ఈ సలహాదారుడు మరొకసారి జగన్ ప్రభుత్వ విధానాల గురించి ప్రజలలో ఉన్న అనుమానాలను మరింత బలోపేతం చేశారు. బాబు షూరిటీ – భవిష్యత్ కి గ్యారంటీ కార్యక్రమం పేరుతొ టీడీపీ పార్టీ డేటా చోరీకి ప్రయత్నిస్తుందంటూ పాత కథకు కొత్త రంగులు వేసి మళ్ళీ ప్రచారంలో తెచ్చారు.
2019 ఎన్నికల సమయంలో కూడా వైసీపీ పార్టీ టీడీపీ ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడుతుందని ప్రజలందరి డేటా సేకరించి ప్రయివేటు కంపెనీలకు అమ్మేసుకుంటుంది అంటూ తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే ఫార్ములాను అప్లై చేయాలనీ చూస్తున్నారు సజ్జల. టీడీపీ పార్టీ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రజల వ్యక్తిగత సమాచారం, ఓటరు ఐడి తీసుకుంటున్నారని అది చట్ట రీత్యానేరమంటూ చట్టాల గురించి నేరాల గురించి కూడా ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల అమలు సజావుగా కొనసాగడం కోసం వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను రూపొందించి ఇంటింటికి వెళ్లి వారి కుటుంబ సమాచారం మొత్తం పొందుపరుస్తున్నాను. అయితే ఇదంతా కూడా చట్ట రీత్యా నేరమంటూ దీని వల్ల ప్రతి కుటుంబం యొక్క వ్యక్తిగత సమాచార వివరాలు వైసీపీ నేతల చేతులలోకి వెళుతున్నాయని ఆ తరువాత అవి ఏ అసంఘటిత శక్తుల దగ్గరకు చేరుతున్నాయో అంటూ వైసీపీ ప్రభుత్వం మీద పవన్ చేసిన ఆరోపణలు మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు.
ఇలా వైసీపీ ప్రభుత్వం సమగ్ర సర్వేల పేరుతో రాష్ట్రంలో చేపడుతున్నసర్వేల మీద కూడా ప్రజలకు పలు అనుమానాలు మొదలవుతాయి. ఇలా సజ్జల గారు టీడీపీ పార్టీని ఇరుకున పెట్టాలని చుసిన ప్రతిసారి అది తిరిగి బూమరాంగ్ అయ్యి జగన్ దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి. ఇక వైసీపీ నాయకులు కూడా “హే మళ్ళీ వచ్చాడు…మళ్ళీ ఇరికించాడు!”అంటూ నిస్సహాయంలోకి వెళ్లిపోతున్నారు.




