నేడు ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ చట్టం పై ప్రజలలో అవగాహన తెస్తూ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు ఒకపక్క, ప్రతిపక్షాల ఆరోపణల పై మండిపడుతూ అధికార పక్షం మరోపక్క ఇలా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే దీనిపై పూర్తి క్లారిటీకి రాలేని ప్రజానీకం తమ ఆస్తుల పై ప్రభుత్వ పెత్తనం అనే ఊహను కూడా సహించలేకపోతున్నారు. అయితే ఇటువంటి సందర్భంలో మాజీ ఐఏఎస్ పివి రమేష్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ చట్టానికి తాను కూడా బాదితుడినే అంటూ తన తల్లితండ్రుల భూ వివాదాన్ని వివరించారు.
కృష్ణా జిల్లా విన్నకోటలో చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు అక్కడి రెవెన్యూ అధికారులు నిరాకరించారని, పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే ఆర్డీఓ వెనక్కి పంపేశారని 36 సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలందించిన తనకే ఈ పరిస్థితి వస్తే ఇక సామాన్యుడు ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో ఊహించడం కూడా కష్టం అంటూ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
దీనితో జగన్ చెపుతున్నట్లుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ‘ఒక సంస్కరణ కాదు స్కాం’ అంటూ మాజీ ఐఏఎస్ పివి రమేష్ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. జగన్ చెపుతున్నట్లుగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నిజంగా ఒక సంస్కరణే అయితే బాబు, పవన్ ప్రస్తావించే వరకు వైసీపీ ఈ చట్టం గురించి ప్రజలలో ఎందుకు చర్చించలేదు..? అలాగే రైతులకు తాను చేస్తుంది మంచే అయితే తన ఎన్నికల ప్రచారంలో కానీ తన మానిఫెస్టోలో కానీ ఈ అంశాన్ని జగన్ ఎందుకు ప్రస్తావించడం లేదు..?
10 పైసల సంక్షేమానికి 10 రూపాయల ప్రచారం చేసుకునే వైసీపీ ఇంత పెద్ద సంస్కరణను తన ప్రచారం నుండి పక్కన పెట్టిందా..? సాక్షి లో కానీ జగన్ అనుకూల మీడియాలో కానీ ఈ చట్టం మీద ఇంతవరకు ఎందుకు ప్రచారం చేయలేదు..? తమ ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రధమ ఎజెండాగా ముందుకెళుతున్న కూటమి నేతలు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలిపే వరకు అసలు రాష్ట్రంలో ఇదొక చట్టం అమలుకు సిద్ధంగా ఉంది అనే అంశాన్ని వైసీపీ తన సిద్ధం సభలలో ఎందుకు ఇంత గోప్యంగా ఉంచింది..?
ఇలా సామాన్యుడిని వెంటాడుతున్నఅనేక ప్రశ్నలకు సమాధానము చెప్పి, ప్రజలను వెంటాడుతున్న పలు అనుమానాలను నివృత్తి చేసే సాహసం జగన్ చేయగలుగుతారా..? మంచి చేస్తున్నాం అని చెప్పడానికి కూడా సందేహిస్తున్న మంచి ప్రజలకు అవసరమా..? ఇది రాజధాని మాదిరో, పోలవరం మాదిరో రాష్ట్రానికి సంబంధించిన అంశం కానే కాదు, ప్రజల వ్యక్తిగత విషయం. వ్యక్తిగత ఆస్తుల జోలికి వస్తే సొంత కుటుంబాన్ని సైతం లెక్క చేయని సాధారణ ప్రజానీకం వైసీపీ కి మద్దతుగా నిలబడతారు అనుకుంటే అది వారి అవివేకమే అవుతుంది.






