ఒక ముఖ్యమంత్రి… ఓ ప్రభుత్వం ఎలా పని చేయకూడదో… వైసీపీ ప్రభుత్వాన్ని చూసి అందరూ తెలుసుకోగలిగారు. అలాగే ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏవిధంగా పనిచేయాలో కూటమి ప్రభుత్వాన్ని చూసి తెలుసుకుంటున్నారు.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వాటికి నిర్దిష్టమైన జాబ్ క్యాలండర్ ప్రభుత్వం ప్రకటించాలని నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నప్పుడు, జగన్ ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ప్రకటించింది.
కానీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం జాబ్ క్యాలండర్ ప్రకటించి, అందరికీ అవకాశం కల్పించేందుకు ఉద్యోగాలకు వయో పరిమితి పదేళ్ళు పెంచి, వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.
డీఎస్సీ గురించి ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. పైగా వైసీపీ హయంలో ఉద్యోగాల భర్తీ చేయకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా అడ్డుపడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం భయపడి జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని నిరుద్యోగ యువత ఆందోళన చెందుతోంది.
కానీ వైసీపీకి భయపడేదేలే.. తగ్గేదేలే.. అన్నట్లు నిన్న ఏపీపీఎస్సీ 892 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాగా, నేడు పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా జాబ్ నోటిఫికేషన్ వివరాలు..
ఎస్సై హోదాలో సివిల్: 253, ఏఆర్: 116, ఎస్పీఎఫ్: 9, కమ్యూనికేషన్స్: 50, పీటీవో: 10 పోస్టులు.
కానిస్టేబుల్ స్థాయిలో.. సివిల్: 542, ఏఆర్: 285, అగ్నిమాపక శాఖ: 158, జైళ్ళ శాఖ: వార్డర్ పురుషులు: 150, వార్డర్ స్త్రీలు: 21, కమ్యూనికేషన్; 200, పీటీవోలో మెకానిక్స్: 15, డ్రైవర్స్: 198, సైంటిఫిక్ అసిస్టెంట్: 43 పోస్టులకు నేడు నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ తెలిపింది. అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తును అధికారిక వెబ్సైట్ https://slprb.ap.gov.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని పోలీస్ రిక్రూట్మెంట్ సూచించింది.





