ఎప్పుడో వంద రెండు వందల సంవత్సరాల క్రితం రాజులు దేవాలయాలకు భూములు, కానుకలు ఇస్తే, రోడ్ల పక్కన మొక్కలు నాటిస్తేనే వాటి గురించి శిలాశాసనాలు చెక్కించుకునేవారు. వాటిని మన చరిత్ర పాఠాలలో చదువుకుంటాము. చూసి మనం ఆహా ఓహో అనుకుంటాము.
అలాంటిది.. సామాన్య రైతులు తమ జీవనోపాధి అయిన వ్యవసాయ భూములను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చేస్తే వారిని మనం ఎంత గౌరవించాలి?ప్రభుత్వం ఇంకెంత గౌరవించాలి?కానీ జరిగింది ఏమిటి?
ఇటీవల అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్, స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో సిఎం చంద్రబాబు నాయుడు రాజధానికి భూములు ఇచ్చిన రైతులను సముచితంగా గౌరవించారు.
కానీ అమరావతినే వద్దనుకుని పాడు బెట్టేసిన మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, రాజధానికి భూములిచ్చిన రైతులను గౌరవిస్తారని ఎలా అనుకోగలం?
వారిని గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ అధికారంలో ఉన్నంతకాలం వారిని వేధిస్తూనే ఉన్నారు. ఇంకా కక్ష తీరకపోవడంతో చాలా మందిపై అక్రమకేసులు నమోదు చేయించి జైలుకి కూడా పంపారు.
వారిలో రాజధాని కోసం తన 50 ఎకరాల భూమినిచ్చిన ధనేకుల రామారావు (78) కూడా ఒకరు. నేలపాడు గ్రామానికి చెందిన అయన మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు.
జగన్ ప్రభుత్వం అమరావతిని పాడుబెట్టేసి, దాని కోసం భూములిచ్చిన రైతులను వేధిస్తుంటే, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కమిటీ ఏర్పాటులో ధనేకుల రామారావు కీలకపాత్ర పోషించారు. దానిలో సభ్యుడుగా రైతుల తరపున నిలబడి పోరాడారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ అమరావతి నుంచి తిరుమలకు రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మూడు రాజధానుల బిల్లుకి వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేసి పోరాడి అడ్డుకున్నారు. ఇందుకు జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టి అక్రమ కేసులతో 40 రోజులు జైల్లో పెట్టింది కూడా.
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమ జీవనోపాధి కోల్పోయినా బాధపడలేదు. కానీ జగన్ ప్రభుత్వం చేసిన ఈ వేధింపులు, అవమానాలు భరించలేకపోయింది.
రాష్ట్ర ప్రజలు కూడా వారిపట్ల సానుభూతి చూపారు కానీ కేసులకు భయపడి మౌనంగా ఉండిపోయారు. కానీ ఎన్నికలలో వైసీపీని ఓడించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించారు. ఇంత జరిగినా మళ్ళీ మావిగన్ రాజధాని అంటున్నారంటే ఆయన తీరు ఏమాత్రం మారలేదని స్పష్టమవుతోంది.
రాజధాని కోసం తమ జీవనోపాధిని త్యాగం చేసి వేధింపులు, కేసులు ఎదుర్కొని జైలుకి కూడా వెళ్ళివచ్చిన ధనేకుల సుబ్బారావు వంటి రైతుల పేర్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.
అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాజధానిని పాడుబెట్టేసి, భూములిచ్చిన రైతులను వేధించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వితంగా నిలిచిపోతుంది.





