వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ రాష్ట్రంలోని అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలలోకి అక్రమంగా ప్రవేశించి దేవతామూర్తులను ఇరగ్గొట్టడం ఆనవాయితీగా మారింది. తాజాగా రామతీర్థంలో రాముడి విగ్రహం కొందరు దుండగులు ఇరగ్గొట్టి కోనేరులో పడేశారు.
దీనితో ప్రభుత్వం మీద భారీగా ఒత్తిడి వస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ దాడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు జరిగిన చాలా కేసులలో దేనిలో కూడా నిందితులను పట్టుకోలేకపోయారు. అసలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా కేవలం ప్రతిపక్షాల కుట్ర అని చెబుతూ సమాధానపడిపోవడంతో అసలు సమస్య మరుగునపడిపోయింది.
తాజాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి కొత్త థియరీతో బయటకు వచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. ఇలాంటి చర్యలకు (దేవుడి విగ్రహాలను పగలగొట్టడం) పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
ఈ థియరీకి సపోర్టు గా ఏవేవో ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ప్రతిపక్షాల కుట్రే అన్నట్టు చెబితే… ఇక పోలీసు వ్యవస్థ కూడా అదే మాదిరిగా ఆలోచిస్తుంది. రామతీర్థంలో ఇప్పటికే కొంతమంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి తామే దీనికి పాల్పడ్డామని ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నారట. ఈ క్రమంలో అన్ని చోట్ల అసలు దొంగలు తప్పించుకుంటారు. ఇటువంటి ఘటనలు ఆగే ప్రసక్తి కూడా ఉండదు.



