బడ్జెట్‌ సమావేశాలలో కల్తీ అవసరమా?

AP Assembly Budget Session Turns Into Ghee Debate

నేడు ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో ప్రధానంగా కల్తీ నెయ్యి వ్యవహారంపైనే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో సహా అందరూ అనర్గళంగా మాట్లాడారు. శాసనసభలో వైసీపీ సభ్యులు లేరు కనుక ఈ చర్చకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోయింది.

కల్తీ నెయ్యి, వైసీపీ అధినేత జగన్‌ గురించి సభ్యులు పోటాపోటీగా మాట్లాడుతుంటే శాసనసభలో బల్లలు పదేపదే మోగాయి. సభ్యులు చిర్నవ్వులు చిందించారు. రాజకీయ భాషలో చెప్పాలంటే ‘పండగ వాతావరణం’లో కల్తీ నెయ్యి చర్చ సాగింది.

ADVERTISEMENT

తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వెళ్ళిపోయారు.

శాసనసభలో ఇటువంటి చర్చలు, విమర్శలు, స్వోత్కర్షలు సర్వసాధారణమే. అయితే కీలకమైన బడ్జెట్‌ సమావేశాలలో కల్తీ నెయ్యిపై ఇంత చర్చ… దాని కోసం ఇంత సమయం వృధా చేయడం సమంజసమేనా?

బడ్జెట్‌ సమావేశాలలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఎమ్మెల్యే శాసనసభకు వస్తారు. వారందరికీ జీతభత్యాలు ప్రభుత్వం ఇస్తుంది. వారికి భద్రత కల్పించేందుకు, ఈ సమావేశాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా వందల మంది పోలీసులను మొహరిస్తారు. ఆ పొలేసులని పర్యవేక్షించేందుకు అనేకమంది ఉన్నతాధికారులు అక్కడ డ్యూటీ చేస్తుంటారు. కనుక ప్రతీరోజూ శాసనసభ సమావేశాల నిర్వహణకు లక్షల్లో ఖర్చవుతుంటుంది.

ఇంత డబ్బు ఖర్చు చేసి, ఇంతమంది ఒక చోట చేరి ఏం చేశారు? అసలు శాసనసభ సమావేశాలు దేనికి నిర్వహిస్తున్నారు? కల్తీ నెయ్యిపై అభిప్రాయలు, తెలివితేటలూ పంచుకునేందుకా లేదా రాష్ట్ర బడ్జెట్‌, రాష్ట్రంలో జరుగుతున్న జరగాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించేందుకా?

కల్తీ నెయ్యిపై తమ అభిప్రాయలు, వాదనలు వినిపించాలనుకుంటే శాసనసభ సమావేశాలు అవసరమా? కూటమి సభ్యులు కూడా జగన్‌లాగే ప్రెస్‌మీట్లు పెట్టుకుంటే సరిపోతుంది కదా?ఇలాంటి నిరర్ధకమైన చర్చలతో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించినా ఏం ప్రయోజనం?ప్రజాధనం వృధా తప్పితే!

మిగిలిన రోజులైనా రాష్ట్రానికి, ప్రజలకు పనికి వచ్చే అంశాలపై లోతుగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటే చూసి ప్రజలు కూడా సంతోషిస్తారు.

ADVERTISEMENT
Latest Stories