టిడిపి, బీజేపీల మద్య సీట్ల సర్దుబాట్లు జరిగి దాదాపు రెండు వారాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు బీజేపీ శాసనసభ, లోక్సభ అభ్యర్ధులను ప్రకటించలేకపోయింది. కానీ టిడిపి, జనసేనలు మాత్రం వరుసపెట్టి అభ్యర్ధులను ప్రకటించేస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ ‘టైమ్స్ నౌ’ ఓ కొత్త విషయం బయటపెట్టింది. దాని సారాంశం ఏమిటంటే, ఏపీలో చాలా గట్టి పోటీ ఉండే లోక్సభ సీట్లను బీజేపీకి కేటాయించి, సులువుగా గెలుచుకోగల వాటిని టిడిపి, జనసేనలు తీసుకున్నాయని ఏపీ బీజేపీ నేతలు తమ అధిష్టానంతో మొరపెట్టుకొంటున్నారట!
ఏపీలో బీజేపీకి సొంత బలం, ప్రజాదరణ రెండూ లేకపోయినా సోము వీర్రాజు, జీవీఎల్ వంటివారు టిడిపితో పొత్తుని వ్యతిరేకించి ఒంటరిగా పోటీ చేద్దామని అధిష్టానంపై ఒత్తిడి చేసిన్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు లభిస్తే, అవన్నీ చాలా గట్టి పోటీ ఉండే సీట్లని టిడిపి తమకు అన్యాయం చేసిందని ఏపీ బీజేపీ నేతలు వాపోతుండటం నిజమైతే చాలా హాస్యాస్పదంగా ఉంది.
బీజేపీకి దక్కిన సీట్లలోనే వారు పోటీ చేసేందుకు భయపడుతున్నట్లయితే ఏపీలో ఒంటరిగా పోటీ చేయగలమని ఎలా అనుకున్నారో వారికే తెలియాలి.
అయినా ఈసారి ఎన్నికలు ఇటు వైసీపికి, అటు టిడిపి, జనసేనలకు జీవన్మరణ సమస్యగా మరీనందున రాష్ట్రంలో ప్రతీ ఎమ్మెల్యే, యంపీ సీటుకి వాటి మద్య చాలా గట్టి పోటీ ఉంటుంది. అటువంటప్పుడు తేలికగా గెలిచే సీట్లు ఎక్కడుంటాయి? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తనను ఓడించేందుకు వైసీపి రూ.100-150 కోట్లు ఖర్చు చేయబోతోందని చెప్పారు. అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చుకైనా వెనకాడరని వేరే చెప్పక్కరలేదు.
ఈవిదంగా పార్టీ అధినేతలే గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తున్నప్పుడు, ఏపీ బీజేపీ నేతలకు సులువుగా గెలుచుకునే సీట్లు ఎక్కడ ఉంటాయి?అయినా తమకు లభించిన సీట్లను చూసే వారు భయపడుతుండటం నిజమైతే, ఇక వారు ఎన్నికలలో ఎలా పోటీ చేయగలరు?ఎలా గెలవగలరు?






