‘ప్రైవేటీకరణ’ ఆపింది మీరైతే ‘రాజధాని’ ఆపింది..?

YS Jagan

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది వైస్ జగన్ లో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుంది. ఇన్నాళ్లుగా ప్రతిపక్ష నేతల మీద నోరేసుకుపడిపోయే జగన్ ఇప్పుడు కూటమి నేతల ఉచ్చులో పడ్డారా అనేలా తన ప్రసంగాల శైలిని ఒక్కసారిగా మార్చేశారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడితో బదులిచ్చే ముఖ్యమంత్రి ఇప్పుడు సంజాయిషీ ఇచ్చే స్థాయికి దిగజారారనిపిస్తుంది.

విశాఖలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ ఇన్నాళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ఆపింది తానేనని, తానూ ఒప్పుకోకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం పై వెనక్కి తగ్గిందన్నారు. తనను కాదని కూటమి పార్టీలకు మద్దతుగా ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోద ముద్ర వేసినట్లే అంటూ విశాఖ వాసులకు జ్ఞానోదయం చేస్తున్నారు జగన్.

ADVERTISEMENT

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ అంశం తెర మీదకు వచ్చింది. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమాలు చేసినా ఏనాడూ దాని మీద స్పందించని జగన్ తానే ప్రయివేటీకరణను అడ్డుకున్నాను అని చెప్పడం నిజంగా శోచనీయం. ప్లాంట్ ఉద్యోగులకు అండగా సభలు పెట్టింది, వారి పోరాటాలకు మద్దతుపలికింది కేవలం ప్రతిపక్ష పార్టీలు మాత్రమే అనేది విశాఖ వాసులకు తెలియనిదా..?

చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అసెంబ్లీ లో కూడా చర్చ జరిగింది. ఈ విషయమై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రజలకు మద్దతు తెలిపారు. కానీ ఏపీ అసెంబ్లీ లో దాని ఊసే లేకపోయింది. అంతెందుకు మొన్నిఈమధ్య విశాఖలో ప్లాంటు ఉద్యోగులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రయివేటీకరణ నిర్ణయంపై అధికార పార్టీ ఎంపీలను నిలదీశారు.

ఇదంతా తెలిసి కూడా జగన్ ప్రజలను మభ్య పెట్టాలని, విశాఖ వాసులను మాయ చేయాలనీ చూడడం కాస్త విడ్డురంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపగలిగిన జగన్ తన నిర్ణయాన్ని అమలు చేయలేక పోవడం పై కూడా కాస్త వివరణ ఇస్తే బాగుంటుందిగా. వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రానికి ఒకటి కాదు మూడు రాజధానులు అంటూ ప్రకటించి చివరకు విశాఖే రాజధాని అంటూ ఋషి కొండకు గుండు కొట్టి మరి నిర్మాణాలు చేపట్టారు.

అయితే ఈ ఉగాదికి, ఈ దసరాకు, ఈ మార్చి నెలాఖరుకు విశాక వెళ్ళబోతున్నాం అంటూ మొదలుపెట్టిన జగన్ ఈ ఐదేళ్లలో ఎన్నో ఉగాదులను, మరెన్నో దసరాలను, ఇంకెన్నో మార్చి నెలాఖరులు చూసారు కానీ అమరావతి నుండి ఒక్కఅడుగు కూడా విశాఖ వైపు వేయలేకపోయారు. అయితే ఈ మే నెలాఖరుకు వైసీపీ ప్రభుత్వ గడువు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో తానూ తీసుకున్న విశాఖ రాజధాని నిర్ణయాన్ని అమలు చేయలేక చేతులెత్తేసిన జగన్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారు అంటే అది నమ్మశక్యమా..?

బాబు అడ్డుకోవడం వల్లనే విశాఖ ను రాజధాని చేయలేకపోయాం అంటూ తన చేతకాని తనని బాబు పై నెట్టేసిన జగన్ విశాక స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపగలిగారు అంటే నమ్మడానికి ఏపీ ప్రజానీకమంతా వైసీపీ కార్యకర్తలు కాదుగా..! రాష్ట్రంలో తానూ అమలు చేయలేక పోయిన ఏ నిర్ణయమేనా దానికి బాబే కారణంటూ చేతులు దులుపుకునే జగన్ రాష్ట్రంలో జరిగిన మంచి అంతటికి తానే కారణంటూ చెప్పుకోవడం ఆయన ప్రచార ఆర్భాటానికి పరాకాష్ట అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories