ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ పాలనలో ఉన్న ఐదేళ్ల డొల్ల తనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పేదవర్గాలకు కార్పొరేట్ వైద్యం పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆరోగ్య శ్రీ ఎన్నో కుటుంబాల జీవితాలలో వెలుగులు తెచ్చింది. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో వైస్సార్ తీసుకువచ్చినప్పటికీ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది.
అయితే వైస్సార్ ఆరోగ్య శ్రీ అంటూ తన తండ్రి పేరును జోడించి పథకాన్ని కొనసాగిస్తున్న జగన్ ఇటు పేరు మార్చడం మీద పెట్టిన శ్రద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించే బిల్లుల మీద పెట్టకపోవడంతో ఇక ఈ సేవలు మేము కొనసాగించలేము అంటూ చేతులెత్తాశాయి ఆసుపత్రులు. ఇందులో భాగంగా మే 4 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ఏపీ కార్పొరేట్ హాస్పటల్స్ అస్సోసియేషన్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో కు ఒక లేఖ రాసారు.
గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదంటూ, దాని ఫలితంగా హాస్పటల్స్ అప్పుల ఊబిలో కురుకుపోతున్నాయని, ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని, ఈ బకాయిలు తీర్చని పక్షంలో ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమంటూ తెగేసి చెప్పేశాయి హాస్పటల్ సంఘాలు. దీనితో ఏపీలో ఆరోగ్య శ్రీ ICU లో వెంటిలేటర్ మీద ఉందనేది స్పష్టమయింది.
మరి వైసీపీ ప్రభుత్వం కార్పొరేట్ హాస్పటల్స్ కు బిల్లులు అనే ఆక్సిజన్ అందించి ఆరోగ్య శ్రీ ని వెంటిలేటర్ మీద నుండి బయటకు తెస్తారో లేక ఎన్నికలు అనే వెంటిలేటర్ మీద ఉన్న వైసీపీని చావుదాక తీసుకు వెళ్తారో వేచి చూడాలి. అయితే వైసీపీ సర్వ వ్యాధులకు బాబే కారణమంటూ ఎదురుదాడి చేసే వైకాపా నాయకులు ఇక్కడ కూడా అదే సూత్రాన్ని అమలు చేసి అధికారం మాది నేరం బాబుది అంటూ చేతులు దులుపుకుంటారా..? అనే అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.




