వైసీపీ హయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి ప్రజలు లోలోన కుమిలిపోతున్న సమయంలోనే కేసీఆర్ హయంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఆ రాష్ట్ర ప్రజలు సంతోషంతో ఉప్పొంగిపోయేవారు. వారి సంతోషం సహజమే.. ఆంధ్రా ప్రజల వేదన సబబే.
కానీ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారగానే ఒక్కసారిగా పరిస్థితి తారుమారు అయినట్లు కనిపిస్తోంది. నీళ్ళు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళులేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హయంలో వేలాది ఎకరాలు ఏవిధంగా దోచుకున్నారో రెండు పార్టీల నేతలే బయటపెట్టుకుంటున్నారు. ఇవన్నీ కళ్ళారా చూస్తూ, చెవులారా వింటున్న తెలంగాణ ప్రజలు మనసులో ఎంత బాధపడుతున్నారో ఊహించుకోవచ్చు.
నీళ్ళు, నిధులు, నియామకాలు తెలంగాణ అజెండాయే కావచ్చు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు వాటిని ఆంధ్రాలో అమలుచేసి చూపుతున్నారు.
నీళ్ళు: వెలిగొండ నుంచి నల్లమల్ల సాగర్కు , పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు నీళ్ళు విడుదల. పోలవరం, సీలేరు తదితర ప్రాజెక్టులలో కొత్తగా లేదా పెండింగ్ నిర్మాణ పనులు వేగవంతం.
నిధులు: రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు, అలాగే సంక్షేమ పధకాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూనే ఉంది ప్రభుత్వం. ఇందుకు నిదర్శనంగా అమరావతి, వెలిగొండ, పోలవరం, సంక్షేమ పధకాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు కనిపిస్తున్నాయి.
నియామకాలు: డీఎస్సీ ద్వారా సుమారు 16 వేలు, పోలీస్ శాఖలో మరో 16 వేలు భర్తీ చేసింది. తాజాగా ఏపీపీఎస్సీ 892 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిన్ననే మరో నోటిఫికేషన్ జారీ చేసింది. రాబోయే మూడేళ్ళలో మరో డీఎస్సీలు ప్రకటిస్తామని విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదివరకు వైసీపీ పాలన చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదా?అనుకుంటే సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేవలం రెండేళ్ళలోనే ఇంత అద్భుతమైన ప్రగతి సాధించింది.
ఇక తెలంగాణకు తిరుగే లేదనుకుంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయాలు, భూముల గొడవలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంత గణనీయమైన మార్పు జరుగుతుందని ఎవరూ ఊహించకపోయి ఉండవచ్చు. కానీ రెండు రాష్ట్రాల భవిష్యత్ ఏవిధంగా ఉంటుందో ఊహించు కోవచ్చు.
తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను చూస్తుంటే బిజేపికి సానుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా సాగుతున్నందున స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడి వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.




