ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి అంటూ హైకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోక తప్పలేదు జగన్ సర్కార్. ఈ ఎన్నికలలో వాలంటర్లే తమ కుడి భుజం అనుకున్న వైసీపీ కి హైకోర్టు షాక్ ఇవ్వడంతో ఇక చేసేదేమి లేక వారిని ఎన్నికల విధుల నుంచి దూరం జరిపే చర్యలకు పూనుకున్నారు ముఖ్యమంత్రి జగన్.
వాలంటీర్లను తక్షణమే విధుల నుంచి తొలగించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు.ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ కార్యక్రమంలోనూ ఈ వాలంటీర్ల సేవలను వినియోగించుకోరాదు, కనీసం పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను నియమించరాదు అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది వైసీపీ సర్కార్. దీనితో వాలంటీర్ల మీద ఎన్నో ఆశలు పెట్ట్టుకుని వారికీ ఎన్నికల తాయిలాలు అందించిన వైసీపీ నాయకుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది.
ఇప్పటికే వైసీపీ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని స్థానికంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసిందని.., ప్రలోభ పెట్టవలసిన వారిని ప్రలోభ పెట్టి, వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోతే మీకు వచ్చే సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయని భయపెట్టే వారిని బయపెట్టేసింది అంటూ ఆరోపిస్తున్నారు విపక్ష పార్టీల నేతలు.
అయితే ఇంకా ఎన్నికలకు నెలన్నర సమయం ఉండడంతో ఈ ప్రలోభాలు.. బెదిరింపులు తాత్కాలికమే అనేది వాస్తవం. అయితే రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు ఎన్నికల కమిషన్ వైసీపీ సర్కార్ పై ఆగ్రహాన్ని వ్యక్త పరిచే అవకాశం ఉండడంతో వాలంటీర్ వ్యవస్థకు జగన్ ప్రభుత్వం తాత్కాలికంగా ప్యాక్అప్ చెప్పక తప్పలేదు.
చివరికి జగన్ మానస పుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థ ఆటలో అరటిపండు మాదిరి ఎన్నికలలో అరటిపండులా మిగిలిపోవాల్సిందేనా..?




