ఏపీలో అధికారం చేజిక్కించుకోవడం కోసం వైసీపీ సమైక్యాంధ్ర అంది. ప్రత్యేకహోదా అంది. అమరావతి, పోలవరాన్ని నిర్మిస్తామని చెప్పింది. చివరికి ప్రభుత్వోద్యోగులను మభ్యపెట్టేందుకు తాము అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని కూడా జగన్ స్వయంగా చెప్పారు. కానీ మళ్ళీ ఎన్నికలొచ్చేస్తున్నా వాటిలో ఏ ఒక్క హామీని అమలుచేయలేదు!
మిగిలినవన్నీ వైసీపీ శక్తి సామర్ధ్యాలకు మించిన పనులు కనుక వాటిని చేయలేకపోయిందని సరిపెట్టుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్న సీపీఎస్ని ఎందుకు రద్దు చేయడం లేదు?అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఎస్ సూర్యనారాయణ ప్రశ్నిస్తున్నారు.
ఆయన సహచర ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు సీపీఎస్కి చట్టబద్దతలేదనే దానిని తాను ముఖ్యమంత్రికాగానే రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మంత్రుల కమిటీ సమావేశాలలో, ఆనాడు ఆయనకు దీనిపై అవగాహన లేకపోవడం వలన హామీ ఇచ్చారని మంత్రులు మాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వ్యక్తికి ఇటువంటి అతిముఖ్యమైన సమస్యపై అవగాహన లేదంటే ఎలా నమ్మగలం?అంటే ఆనాడు మమ్మల్ని మభ్యపెట్టారనుకోవాలా?
సీపీఎస్కు చట్టబద్దత లేదని మేము మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము. కనుకనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. చట్టబద్దతలేని సీపీఎస్ను రాష్ట్ర ప్రభుత్వం ఏవిదంగా కొనసాగిస్తోంది? లక్షలాది మంది ఉద్యోగులు దాచుకొన్న వేలకోట్ల సొమ్మును చట్టబద్దతలేని సీపీఎస్లో ప్రభుత్వం ఎందుకు జమా చేస్తోంది?దీంతో భవిష్యత్తులో ఉద్యోగులు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈవిదంగా ఎందుకు వ్యవహరిస్తోంది? చట్టబద్దతలేని సీపీఎస్ను రద్దు చేయాలని మేము కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి చట్టబద్దత కల్పిస్తానని ఎందుకు చెపుతోంది?” అంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఎస్ సూర్యనారాయణ ప్రశ్నలు సందించారు.
ఇప్పటివరకు మంత్రుల సబ్ కమిటీతో చాలాసార్లు సమావేశమయ్యామని, కానీ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఇలా సమావేశాలతోనే నెలలు, సంవత్సరాలు దొర్లించేస్తూ తమ సమస్యలు, డిమాండ్స్ ఏవీ పరిష్కారించకుండానే బయటపడాలని ప్రయత్నిస్తున్నట్లు తమకు అనుమానం కలుగుతోందన్నారు సూర్యనారాయణ.
కనుక ముందుగా ఈ సీపీఎస్ సమస్యను హైకోర్టులోనే పిటిషన్ వేసి దాని చట్టబద్దతని తేల్చుకొంటామని సత్యనారాయణ చెప్పారు. ఇంతకాలం ఉద్యోగులందరూ చాలా సహనంగా సర్దుకుపోయామని కానీ తమ సహనాన్ని ప్రభుత్వం అలుసుగా తీసుకొని తమతో ఆటలాడుకొంటోందని కనుక నేటి నుంచే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సూర్యనారాయణ అన్నారు.



