వైసీపి అధికారంలోకి రాగానే త్రిశంకు స్వర్గం వంటి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను సృష్టించింది. అవి త్రిశంకు స్వర్గమని ఎందుకంటే, వాటికి రాజ్యాంగ బద్దత లేదు. వాటిలో పనిచేసే లక్షలాది మందికి చట్టపరమైన ఉద్యోగ రక్షణ కూడా లేదు కనుక!
చట్టబద్దత లేని వాటి కోసం వైసీపి ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేస్తూ, వాటిని వైసీపి రాజకీయ అవసరాల కోసం వినియోగించుకొంటూ నూటికి నూరు శాతం లబ్ధి పొందుతోంది. ఎన్నికలలో ఈ రెండు వ్యవస్థలే వైసీపి విజయానికి దోహదపడబోతున్నాయి.
అయితే వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలు మాత్రం ఆగమ్యగోచరంగా సాగుతున్నాయి. వాటితో కుటుంబాన్ని పోషించుకొనేందుకు తగినంత ఆదాయం రాకపోయినా, క్షణం తీరికలేని ఆ ఉద్యోగాల కారణంగా వేరే ఉద్యోగాలు వెతుక్కొనే అవకాశం వారికి ఉండదు.
రాబోయే ఎన్నికలలో ఈ రెండు వ్యవస్థలను ఉపయోగించుకొని, మళ్ళీ అధికారంలోకి రావలనేది వైసీపి లక్ష్యమని మంత్రులు, ఎమ్మెల్యేల మాటలతోనే స్పష్టమవుతోంది. కనుక రాజ్యాంగబద్దత లేని ఈ రెండు వ్యవస్థలను రద్ధు చేయాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధ్వర్యంలో ఏర్పాటైన ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహిత పిటిషన్ వేసింది.
ఈ రెండు వ్యవస్థలతో వైసీపి ప్రభుత్వం రాష్ట్రంలోభారీగా దొంగఓట్లు నమోదు చేయిస్తోందని ప్రతిపక్షాలు పిర్యాదులు చేస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కనుక రాజ్యాంగంలోని సెక్షన్స్ 21,243లకు వ్యతిరేకంగా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు వైసీపి ప్రభుత్వం జారీ చేసిన జీవో 104ని కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టుని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కోరింది.
దీనిపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. కానీ ఎన్నికలలోగా సుప్రీంకోర్టు దీనిపై తుది తీర్పు వెలువరించలేకపోవచ్చు. కానీ ఈ రెండు వ్యవస్థలను రద్దు చేయాలని తీర్పు ఇస్తే లేదా రేపు ప్రభుత్వం మారితే నాలుగేళ్ళుగా వీటిలో పనిచేస్తున్న లక్షలాదిమంది పరిస్థితి ఏమిటి?
అందుకే ఇవి వైసీపి సృష్టించిన త్రిశంకు స్వర్గాలని చెప్పక తప్పదు. కనుక వాటిలో నుంచి ఎంత త్వరగా బయటపడితే వారికే అంత మంచిది. లేకుంటే ప్రభుత్వం మారినప్పుడు వైసీపి కోసం చేసిన తప్పులకు వారు కూడా మూల్యం చెల్లించుకోవలసి రావచ్చు.




