వైసీపిలో అందరూ భస్మాసురులేనా?

Gudivada Amarnath Vijayasai Reddy Ambati Rambabu

జగన్ రాజకీయ మేధావా?అంటే ముఖ్యమంత్రి అయ్యారు కనుక అవుననే అనుకున్నారు. కానీ 5 ఏళ్ళ పాలనలో తనకు అంత సీన్ లేదని నిరూపించుకున్నారు. ఎన్నికలలో ఓడిపోతున్నామని తెలిసినా తనకు ఈ దుర్గతి పట్టించిన ఐప్యాక్ టీమ్‌ని అభినందించడం చూసి అప్పుడే అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు. ఇప్పుడు ఆ చర్చ అనవసరం.

ADVERTISEMENT

అయితే ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్‌తో సహా వైసీపిలో ఎవరిలో ఎటువంటి మార్పు, పశ్చాత్తాపం కనిపించకపోవడం చూస్తే ఆశ్చర్యం కలుతుంది.

జగన్మోహన్‌ రెడ్డి గత 5 ఏళ్ళుగా కొన్ని మీడియా సంస్థలని శత్రువులుగా ప్రకటించేయడంతో అవన్నీ నిజంగానే శత్రువులుగా మారిపోయి, ఎన్నికలలో ఆయన గద్దె దించేందుకు నిద్ర పోలేదు.

విజయసాయి రెడ్డికి ఈ విషయం తెలిసి ఉన్నప్పటికీ మీడియా సంస్థలపై తీవ్ర విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మీడియాని ఓ కులం శాశిస్తోందని, కనుక మీడియా వార్తాలని నమ్మలేమని తేల్చిచెప్పేశారు.

అయితే కేవలం కులం కారణంగానే రాష్ట్రంలో మీడియా సంస్థలన్నీ టిడిపిని భుజాన్న వేసుకొని మోస్తున్నాయా? మరే కారణాలు లేవా?అంటే చాలానే ఉన్నాయని అందరికీ తెలుసు.

జగన్‌కు అమరావతి, సినీ పరిశ్రమ, మీడియా, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు దేనినైనా కులం, రాజకీయ కోణంలో మాత్రమే చూసే దురలవాటు ఉంది. ఆ దురలవాటే వైసీపికి ఇబ్బడి ముబ్బడిగా శత్రువులను సంపాదించి పెట్టింది. జగన్‌ ఆ శత్రువులను నామ రూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలని అనుకున్నారే తప్ప వాటితో శతృత్వం తగ్గించుకోవాలని అనుకోలేదు. అందువల్లే మీడియాతో సహా ప్రతీ రంగంలోను జగన్‌కు శత్రువులే తప్ప మిత్రులు లేకుండా పోయారు.

మీడియాని వైసీపి, వైసీపిని మీడియా శత్రువులుగా భావిస్తున్నప్పుడు, వైసీపి నేతలు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలతో వైసీపి పట్ల ప్రజలలో మరింత వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. అందరూ కలిసి తమ శత్రువుల సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వైసీపికి తీరని అపకారం చేస్తున్నారని చెప్పవచ్చు.

ఏ రాజకీయ నాయకుడైన తమ ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటాడు. కానీ వైసీపిలో జగన్‌తో సహా దాదాపు అందరూ చాలా తెలివిగా, లౌక్యంగా మాట్లాడుతున్నామని అనుకుంటూ తమ పార్టీని తామే దెబ్బతీసుకుంటున్నారు. వైసీపి ఇటువంటి దుర్గుణం కలిగి ఉండటం టిడిపి కూటమి ప్రభుత్వానికి వరంగానే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories