బెంగాల్ బ్రహ్మచారి.. సువేందు అధికారి ముఖ్యమంత్రి

Suvendu Adhikari with Narendra Modi and Amit Shah during celebrations over BJP’s historic victory in West Bengal

బిజేపికి బ్రహ్మచర్యం బాగా అచ్చొచ్చినట్లుంది. ప్రధాని మోడీ, యూపీ సిఎం యోగీ ఆదిత్య నాథ్ తర్వాత పశ్చిమ బెంగాల్లో మరో బ్రహ్మచారి పాలన ప్రారంభం కాబోతోంది. ఆయనే సువేందు అధికారి! మోడీ, అమిత్ షాల మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో బిజేపిని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన అయన భవానీపూర్‌లో మాజీ సిఎం మమతా బెనర్జీపై పోటీ చేసి ఆమెని ఓడించి బిజేపి పెద్దల మనసులు గెలుచుకున్నారు.

శుక్రవారం కోల్‌కత్తాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజేపి ఎమ్మెల్యేలు సువేందు అధికారిని శాసనసభాపక్ష నాయకుడుగా ఎన్నుకున్నారు. నేడు కోల్‌కత్తాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా జరుగబోయే ప్రమాణస్వీకారోత్సవంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో బిజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజేపి అధ్యక్షుల సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

ADVERTISEMENT

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్లో బిజేపికి చోటు లభించలేదు. కనుక బిజేపి ఏకధాటిగా గత 10-15 ఏళ్ళ నుంచి బెంగాల్ కంచుకోటని వశపరుచుకోవడానికి శ్రమిస్తూనే ఉంది. ఎట్టకేలకు దాని శ్రమ ఫలించి, తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది.

అయితే ‘సర్’ పేరుతో 93 లక్షలకు పైగా తృణమూల్ కాంగ్రెస్‌ ఓటర్లను జాబితాలలో నుంచి తొలగించి బిజేపి దొడ్డి దోవన అధికారం చేజిక్కించుకుందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఏ పార్టీకైనా ఎన్నికలలో గెలుపే ప్రామాణికం. ఓడిపోయిన పార్టీలు చేసే విమర్శలు, ఆరోపణలకు విలువుండదు.

పశ్చిమ బెంగాల్లో బిజేపి కాషాయజెండా ఎగరేయడంతో ఈ ప్రభావం దేశ రాజకీయాలపై చాలా ఉంటుంది. బిజేపి తదుపరి లక్ష్యం తెలంగాణయేనని ఆ రాష్ట్ర బిజేపి నేతలు ప్రకటించగా, ఏపీ, తెలంగాణలలో ‘సర్’తో తమ ఓటు బ్యాంకు ఆవిరైపోకుండా జాగ్రత్తపడాలని వైసీపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు అప్పుడే హడావుడి పడుతున్నాయి. ఇది పశ్చిమ బెంగాల్ ఫలితాల ప్రభావమే కదా?

ADVERTISEMENT
Latest Stories