2019 ఎన్నికల ప్రచారం చివరి దశలో ఒక్కసారిగా రాష్ట్రమంతా జగన్ వేవ్ కనపడింది. వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే సంకేతాలు ముందుగానే గ్రహించగలిగింది వైసీపీ. అందులో భాగంగానే పలువురు టీడీపీ నేతలు, కొందరు సెలబ్రేటిస్ వైసీపీ కండువా కప్పుకుని జగన్ కు మద్దతు తెలియచేసారు.
జగన్ కుటుంబం మొత్తం తల్లి, చెల్లి, సునీత ఆయనకు వెన్నుముకగా నిలిచారు. వ్యవస్థలన్నీ జగన్ కు అనుకూలంగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ బాబు కు వ్యతిరేకంగా జగన్ కు సహకరించడం అన్ని ఒకదానికి ఒకటి జతకట్టాయి. అలాగే కేంద్ర పెద్దల ఆశీస్సులు జగన్ కు అందడంతో అనుకున్న ఒక్క ఛాన్స్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు జగన్.
దానికి తోడు జగన్ పై జరిగిన కోడికత్తి దాడి, జగన్ బాబాయ్ వివేకా హత్య ఇవన్నీ జగన్ కు ప్రజలలో సింపతీని తెచ్చిపెట్టాయి. అలాగే టీడీపీ, జనసేన పార్టీల మధ్య స్నేహ సంబంధాలు చెడిపోవడం, ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో అది వైసీపీకి కొండంత బలాన్ని తెచ్చి పెట్టింది. సరిగ్గా ఐదేళ్లు గడిచేసరికి అప్పుడు జగన్ గెలుపుకి కారణమైనవే ఇప్పుడు జగన్ ఓటమిని నిర్దేశిస్తున్నాయి. కాలం ఎంత బలమైనదో, ఎంత వేగంగా జీవితాలను తలక్రిందులు చేయగలదో ఇపుడు జగన్ కు తెలిసి వస్తుంది.
తన గెలుపు కోసం పాదయాత్రలు చేసిన చెల్లి షర్మిల ఇప్పుడు జగన్ ఓటమి కోసం పోరాట యాత్రలు మొదలుపెట్టింది. తన తండ్రి చావుకి కారణమైన వారిని శిక్షిస్తారు అని జగన్ వెంట నడిచిన సునీత ఇప్పుడే అదే జగన్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. గతంలో వ్యవస్థలలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకున్న జగన్ ఇప్పుడు వ్యవస్థలతో వచ్చే అవస్థలను చవి చూస్తున్నారు. గతంలో ప్రత్యర్థి పార్టీని వీడి తన పార్టీ కండువా కప్పుకున్న నేతలు ఇప్పుడు వైసీపీ కండువా తీసి టీడీపీ, జనసేన కండువాలు కప్పుకున్నారు.
అలాగే సినీ ఇండస్ట్రీ నుండి కూడా గతంలో చిన్న చిన్న సెలబ్రేట్ వైసీపీ కి మద్దతుగా ప్రచారం చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలే కూటమికి అండగా తమ మద్దతు తెలియ చేస్తున్నారు. బాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రక్రియలో జగన్ ముఖ్యమంత్రి పదవికి సహకరించిన కేసీఆర్ ఇప్పుడు తానే రేవంత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి లాక్కోలేక పీక్కోలేక సతమతవుతున్నారు.
ఇక కేంద్ర పెద్దల ఆశీస్సులు దక్కాయి అనుకుని అధికారులను అడ్డుపెట్టుకుని తన ఒక్క ఛాన్స్ కల నెరవేర్చుకున్న జగన్ ఇప్పుడే అదే కేంద్ర పెద్దల చేత అవహేళనకు గురవుతున్నారు. జగన్ ఒక అవినీతి నేరస్తుడు అంటూ మోడీ, షాలు జగన్ పై విమర్శల విల్లు ఎక్కుపెట్టారు. ఇక గతంలో కోడికత్తితో వచ్చిన సింపతీని ఇప్పుడు గులకరాయితో పోగొట్టుకున్నారు జగన్.
అలాగే తన బాబాయ్ వివేకా హత్య జగన్ కు తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి ఒక అస్త్రం లా ఉపయోగపడితే ఇప్పుడే అదే వివేకా హత్య కేసు జగన్ ను ప్రతిపక్షంలోకి లాక్కురాబోతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీడీపీ, జనసేన కలయిక. 2019 లో జగన్ గెలుపుకి బాబు ఓటమికి మధ్య వారధిగా నిలిచింది జనసేన. జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది వైసీపీకి అనుకూలంగా మారింది.
టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చెయ్యకూడదు అని విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్ బాబు అరెస్టుతో ఈ వ్యూహానికి నీళ్లొదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ తన స్వయం కృతాపరాధం తోనే టీడీపీ, జనసేన కూటమికి అడుగులు వేసేలా చేసారు.ఈ రెండు పార్టీల కలయికలను ఆపలేక పోయిన వీరి మధ్య బంధాన్ని తెంపాలని ప్రయత్నాలు చేసినా అవి ఫలితాన్ని ఇవ్వకపోగా బంధం మరింతగా బలపడింది. కనీసం ఈ రెండు పార్టీల పొత్తులోకి బీజేపీ చేరకూడదు అంటూ మొక్కులు మొక్కిన వైసీపీ కి అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురయ్యింది.
దీనితో 2014 నాటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు పొడిచింది. 2014 నాటి ఓటమి జగన్ కు కళ్ళ ముందు సాక్ష్యాత్కారం అవుతున్నా ఇంకా తనను తానూ మభ్య పెట్టుకుంటూ మరో ఛాన్స్ కోసం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేస్తున్నారు జగన్. ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్నా ఈ పరిణామాలన్ని గమనిస్తే జగన్ ఓటమికి సంకేతాలు ఇవేనా అనే అనుమానాలు ప్రతిఒక్కరికి కలుగకమానవు.






