టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటిస్తున్నప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ అనుచరులు రాళ్ళ దాడి చేయడంపై టిడిపి తగురీతిలో చర్యలు తీసుకోబోతోంది. అయితే చంద్రబాబు నాయుడు ఏదైనా జిల్లా లేదా నియోజకవర్గంలో పర్యటిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు చొక్కాలు చింపుకోవాలా?మంత్రి ఆదిమూలపు సురేష్ నడిరోడ్డుపై ప్రజలు, మీడియా అందరూ చూస్తుండగా ఎందుకు చొక్కా విప్పారు?అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక మంత్రి అయ్యుండి రోడ్డుపై చొక్కా విప్పడాన్ని సమర్ధించుకొంటారా?అని విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింటే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.
“చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలేనికి సాయంత్రం 6 గంటలకు రావచ్చని తెలుసుకొని నేను 4.30 గంటలకు మీడియాతో మాట్లాడేందుకు వచ్చాను. అప్పుడు మీ ప్రెస్వాళ్ళు “నేను నిరసన తెలిపితే టిడిపి వాళ్ళు మీ ఇంటిని ముట్టడిస్తారట…. మీ ఇంటిపై రాళ్ళు వేస్తారట… మీ ఇంటిని తగులబెడతారట…” అని చెప్పినప్పుడు, దళితులు నిరసనలు తెలిపితే తెలుగుదేశం నాయకులు దురహంకారంతో మాట్లాడుతారా? నా ఇంటిని తగులబెడతారా?అంటూ నా ఇంటితో పాటు నన్ను తగలబెట్టండి…” అని నేను చొక్కా విప్పి సవాలు చేశాను,” అని జవాబు చెప్పారు.
“ఎవరో చెప్పారని చెప్పి మంత్రి అయ్యుండి మీరు చొక్కా విప్పి నిరసన తెలియజేయడాన్ని సమర్ధించుకొంటారా?” అని విలేఖరి మళ్ళీ సూటిగా ప్రశ్నించినప్పుడు, మంత్రి ఆదిమూలపు సురేష్ తాను ఓ మంత్రి, ఎమ్మెల్యే కంటే ముందు దళితుడినని సమర్ధించుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. “దళితుల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బ తీస్తున్నారు కనుకనే నేను ఓ దళితుడిగా నిరసన తెలిపాను,” అని సమర్ధించుకొన్నారు.
ఆదిమూలపు సురేష్ లేదా మరొకరు ఎవరైనా సరే ఓ మంత్రిగా, ఎమ్మెల్యేగా తన జిల్లా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొంటూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తమ సమర్ధత నిరూపించుకొనే ప్రయత్నం చేయాలి తప్ప ఈవిదంగా కులం, మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలనుకోవడం సమర్ధనీయమేనా?
మంత్రి పదవుల కోసం ఎంతగానో ఆరాటపడి సాధించుకొన్న తర్వాత అసలు ఎంతమంది మంత్రులు తమ శాఖలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు?ఎంతవరకు తమ పదవులకు న్యాయం చేస్తున్నారు?అని ఎవరికివారు ప్రశ్నించుకోవలసి ఉంది. ఎందుకంటే, మంత్రి పదవులు మళ్ళీ మళ్ళీ దక్కేవికావు. కనుక మంత్రి పదవి లభించినప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యావత్ రాష్ట్ర ప్రజలు తమను కలకాలం గుర్తుంచుకొనేలా పని చేయగలిగితే అందరూ హర్షిస్తారు. కానీ అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ఈ విదంగా రోడ్లపై చొక్కాలు చించుకొంటే ప్రజల దృష్టిలో చులకనవుతారని గ్రహిస్తే మంచిది. అయినా ప్రజాభిమానం పొందలేని మంత్రులు, ఎమ్మెల్యేలను సిఎం జగన్మోహన్ రెడ్డే పక్కన పెట్టేస్తున్నారు కదా?మరెందుకు రోడ్లపై చొక్కాలు చింపుకోవడం?



