ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే, వైసీపీలో మంత్రులందరికీ కడుపు మండిపోయింది. అందరూ పోటీలుపడుతూ ఆయనను 48 గంటలపాటు తిట్టిపోశారు. తమ అధినేతని మెప్పించడం కోసం రజనీకాంత్ గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడి ప్రజల దృష్టిలో తామే చులకనయ్యామనే విషయం ఎవరూ గ్రహించిన్నట్లు లేదు.
జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి భేటీ అయితే వారి గురించి కూడా వైసీపీ మంత్రులు అవాకులు, చవాకులు మాట్లాడుతూనే ఉన్నారు. అసలు వారిద్దరూ ఏం మాట్లాడుకొన్నారో తెలియకపోయినా టిడిపితో పొత్తుల కోసం పవన్ కళ్యాణ్ పరితపించిపోతున్నారని, ఇద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రెండు రాజకీయపార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలనుకోవడం తప్పు కాదు. అందుకోసం అవి పొత్తులు పెట్టుకోవాలనుకోవడం నేరమూ కాదు. కానీ నేరమని వాదిస్తున్నారు… సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రుల వరకు అందరూ!
రజనీకాంత్ చంద్రబాబు నాయుడు పొగిడినందుకు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయినందుకు మంత్రులు అందరూ పోటీలుపడి వారిని తిట్టిపోశారు. కానీ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలపై ఇంతవరకు వైసీపీలో ఏ మంత్రి ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు. తమ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు, చిత్తూరు, కడప వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే ఏ మంత్రికి మాట్లాడేందుకు నోరు పెగలడం లేదు! ఈ రెండు అంశాలపై సాక్షి మీడియా కూడా స్పందించలేకపోతోంది!
అంటే మన ఇంట్లో మంటలు అంటుకొన్నప్పుడు వాటిని దాచిపెట్టేసే ప్రయత్నం చేస్తూ, పొరుగువాడి ఇంటికి మంటలు అంటుకొంటే పండగ చేసుకోవాలన్నట్లు ఉంది వైసీపీ నేతల తీరు. అసలు వైసీపీలో ఇటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా అద్దాల మేడలో కూర్చొని ఎదుటవారిపై రాళ్ళు వేస్తే ఎందుకు?వేస్తే ఏమవుతుందో తెలియదా?



