అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కాస్త ఎకస్ట్రాలు చేస్తుంటారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరీ ముఖ్యంగా… ఎస్ఐ, సీఐ, ఎస్పీ, డీఎస్పీ బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడం పరిపాటి. తాము కోరుకొన్నవారికి కోరుకొన్నచోట పోస్టింగ్ ఇప్పించుకోవడం గొప్పగా భావిస్తుంటారు. అలాగే ఎవరిపైనైనా ఆగ్రహం కలిగితే వారిని బలవంతంగా వేరే చోటికి బదిలీ చేయించేయించి తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఇటీవల జరిగిన 77 మంది డీఎస్పీల బదిలీలలో వైసీపీ నేతల బలప్రదర్శనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఒంగోలు డీఎస్పీగా అశోక్వర్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన గంటలోపే దర్శికి బదిలీ చేయబడ్డారు! వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డికి ఆగ్రహించడమే ఇందుకు కారణం. ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు మాట మాత్రం చెప్పకుండా ఒంగోలు డీఎస్పీగా అశోక్వర్ధన్ రెడ్డినూయి నియమించడాన్ని బాలిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
కనుక ఆయనను బుజ్జగించేందుకు అశోక్వర్ధన్ రెడ్డిని దర్శికి బదిలీ చేసి, దర్శి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె.నారాయణస్వామి రెడ్డిని ఒంగోలు డిఎస్పీగా నియమిస్తూ శుక్రవారం రాత్రి మళ్ళీ ఉత్తర్వులు వెలువడ్డాయి. డిజిపి స్వయంగా బాలినేని శ్రీనివాస రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఆయన సూచన మేరకు ఈ బదిలీలు చేసిన్నట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లా డీఎస్పీ బదిలీ విషయంలో కూడా మంత్రి బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్ళీ బదిలీలు జరిగిన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వానికి విధేయంగా పోలీస్ శాఖ పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇలా అధికార పార్టీ నేతల చేతుల్లో పావులుగా మారిపోవడం చాలా శోచనీయమే. అధికార పార్టీ నేతల చేతుల్లో వారి పదవులు, ప్రమోషన్స్, బదిలీలు ఉన్నప్పుడు ఇక వారు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎలా పనిచేయగలరు?
వైసీపీ నేతలకు డీఎస్పీ బదిలీలు తమ పరపతిని ప్రదర్శించే రాజకీయ చదరంగం కావచ్చు కానీ ఈవిదంగా చేయడం వలన పోలీస్ ఉన్నతాధికారుల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది కదా?ఒంగోలు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంటలోపే ఆ సీటు ఖాళీ చేసి దర్శికి వెళ్లిపోవాలని చెప్పినప్పుడు ఆయన ఆత్మగౌరవం దెబ్బ తినదా?అంటే పోలీస్ అధికారుల గౌరవమర్యాదల కంటే వైసీపీ నేతల పంతాలు పట్టింపులే ఎక్కువా…ముఖ్యమా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.



