దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసి ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో తెలంగాణ బీజేపీ మంచి ఊపు మీద ఉంది. దీనితో త్వరలో జరిగే నాగార్జునసాగర్, మునిసిపల్ ఎన్నికల మీద దృష్టి సారించారు కమలనాథులు. తెరాస ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణంతో జరుగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని ఆరాటపడుతున్నారు.
నాగార్జునసాగర్, వరంగల్ మునిసిపల్ ఎన్నికల కోసం దుబ్బాక, జీహెచ్ఎంసీ టీమ్లనే ముందు పెడుతుంది ఆ పార్టీ. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎల్బీ నగర్ జోన్ లో బీజేపీ కి కళ్ళుచెదిరే ఫలితాలు సాధించిన సంకినేని వెంకటేశ్వర రావు ని నాగార్జునసాగర్ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా నియమించింది.
అలాగే దుబ్బాకలో పని చేసిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని వరంగల్ మునిసిపల్ ఎన్నికలకు బాధ్యుడిగా నియమించారు. వారు త్వరలో అక్కడ మకాం వేసి గ్రౌండ్ లెవెల్ లో తమ పని మొదలుపెట్టబోతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా పని మొదలుపెట్టడం కమలనాథుల స్పీడ్ ని సూచిస్తుంది.
మరోవైపు… ఈ రెండు ఎన్నికలలో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అధికారపక్షం ఆరాటపడుతుంది. ఈ రెండు ఎన్నికలలో భారీ విజయాలు నమోదు చేస్తే… దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలను వన్ టైం వండర్ అంటూ తీసిపారెయ్యొచ్చు అని వారి ఆలోచన. బీజేపీకి కూడా ఆ విషయం తెలుసు అందుకే తమ సన్నాహాలు ముమ్మరం చేశారు.



