షేర్ మార్కెట్… ఇది ఎప్పుడూ బంగారు పంజరం వంటిదే. అవగాహన లేకుండా ఎవరి మాటలో నమ్మి పెట్టుబడులు పెట్టి నష్టపోయినవారు షేర్ మార్కెట్కి ఓ దణ్ణం పెట్టి బయటకు వచ్చేస్తుంటారు. తక్కువ సమయంలో సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది ఈ బంగారు పంజరంలోకి ప్రవేశిస్తుంటారు.
కనుక అవగాహనలేనివారి ఆశనే సైబర్ నేరగాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల దురదృష్టమో లేదా సైబర్ నేరగాళ్ళ అదృష్టమో కానీ ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) కూడా అందుబాటులోకి వచ్చేసింది. కనుక దానిని కూడా వాడేసుకుంటూ ప్రజలను దోచేసుకుంటున్నారు.
ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని ఫోన్, టీవీ, కంప్యూటర్లలో ఏం చూస్తున్నామో అవతలి వ్యక్తులు తెలుసుకోగలుగుతున్నారు. అందువల్లే మనం టీవీలు, ఫ్రిజ్, ఏసీ లేదా కార్లు బైకులు లేదా ఆరోగ్య సంబందిత అంశాలను చూస్తే వాటికి సంబంధించిన ప్రకటనలే మన ఫోన్, కంపూటర్లలో కనబడుతుంటాయి. అంటే మన ఆన్లైన్ లావాదేవీలు, వెదుకులాటపై చాలా నిఘా ఉందన్నమాట.
కనుక షేర్ మార్కెట్లో పెట్టుబడులపై కూడా తప్పక ఉంటుంది. అందుకే వాట్స్ అప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో ఉచితంగా షేర్ మార్కెట్ సలహాలు ఇస్తామంటూ చాలా మంది ఉచ్చులోకి లాగుతుంటారు. వారి ఉచ్చులో చిక్కుకుంటే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోవడం ఖాయం.
ముందే చెప్పుకున్నట్లు షేర్ మార్కెట్ అనే బంగారు పంజరంలో చిక్కుకొని దానిలో నుంచి బయటపడాలనుకునే వారు చివరి ప్రయత్నంగా జాతకాలు చెప్పేవారిని ఆశ్రయించి, వారి సలహాతో షేర్ మార్కెట్లో మళ్ళీ మరికొంత పెట్టుబడులు పెట్టి మరింత సొమ్ము పోగొట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటువంటి వారి కోసమే షేర్ మార్కెట్కి సంబంధించి ఓ చక్కటి కొటేషన్ ఉంది. “మీరు డబ్బుతో షేర్ మార్కెట్లో ప్రవేశిస్తే మంచి అనుభవం వస్తుంది. అదే మంచి అనుభవంతో ప్రవేశిస్తే డబ్బు వస్తుంది.”
కనుక ఇప్పటికే షేర్ మార్కెట్లో ఉన్నవారు, బయటకు వచ్చేయలనుకుంటున్నవారు, ప్రవేశించాలని ఆరాట పడుతున్నవారు ఈ రంగంలో అనుభవజ్ఞులు లేదా ఆర్ధిక నిపుణుల సలహా తీసుకొని ముందుకో వెనక్కో అడుగు వేస్తే మంచిది.
గ్రహస్థితి, జాతకాలు నమ్ముకొని పెట్టుబడులు పెడితే నష్టాలే వస్తాయి. అప్పుడు గ్రహస్థితి ఇంకా చెడిపోతుంది. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలతో యావత్ ప్రపంచదేశాల షేర్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు, దీని గురించి అవగాహన లేనివారు దూరంగా ఉండటమే చాలా మంచిది.







