కింగ్ నాగార్జున హోస్టుగా చేస్తున్న బిగ్ బాస్-3 షో ఈ నెల 21న ప్రారంభం కాబోతుంది. అయితే షో ప్రారంభం తేదీ దగ్గర పడే కొద్దీ వివాదాలు చుట్టుముడుతున్నాయ. ఇప్పటికే ఒక టీవీ యాంకర్, గాయని షో నిర్వాహకులపై కేసులు పెట్టారు. దీనితో విపరీతమైన బాడ్ పబ్లిసిటీ వచ్చింది. ఈలోపే ఈ కేసుల సంగతి తేల్చేద్దామని స్టార్ మా టీవీ భావిస్తోంది. బంజారాహిల్స్, రాయదుర్గం పీఎస్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ మేరకు పిటిషన్ వేశారు.
మరోవైపు, బిగ్ బాస్ 3 ప్రసారాన్ని నిలిపివెయ్యాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు 100 రోజుల పాటు జరగబోయే ఈ షో లో 15 మంది పోటీదారులు ఉంటారట. ఈ షో పై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. గత రెండు సీజన్లలో బిగ్ బాస్ షో పై ఇటువంటి వివాదాలు రాకపోవడం గమనించదగిన విషయం.
మొదటి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. తమిళ, హిందీ బిగ్ బాస్ షోలకు అన్ని సీజన్లకు ఒకే హోస్ట్ ఉండగా తెలుగుకు మాత్రం మూడు సీజన్లకు ముగ్గురు అయ్యారు ఇప్పటికి. ఇప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, నానిలకు ఇంతకు ముందు టీవీలో చేసిన అనుభవం లేకపోగా… నాగార్జున మాత్రం ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ అనిపించుకున్నారు. మరి ఆయన బిగ్ బాస్ లో చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.



