ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా వాలంటీర్లకి ఇస్తున్నారెందుకు?

Devusinh_Chauhanకేంద్ర టెలీ,కమ్యూనికేషన్స్ సహాయమంత్రి దేవుసింహ్ జైసింగ్ భాయ్ చౌహాన్ సోమవారం రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి అనంతపురం, పుట్టపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ మంచి ప్రభుత్వం అందించడంలో దారుణంగా విఫలమైంది. చివరికి ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి నెలనెలా సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకొంది. ఉద్యోగులకి జీతాలు చెల్లించకపోయినా లక్షలాది వాలంటీర్లకి మాత్రం ప్రజాధనాన్ని పంచిపెడుతూ వారినందరినీ వైసీపీ అవసరాలకి, కార్యక్రమాలకి వాడుకొంటోంది. వాలంటీర్ల సాయంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలని రాజకీయంగా దెబ్బతీయడానికి వైసీపీ ప్రభుత్వం వాడుకొంటోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగినన్ని నిధులు అందిస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా సంక్షేమ పధకాలతో కాలక్షేపం చేస్తోంది. పైగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులని ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణాభివృద్ధికి మంజూరు చేసిన నిధులని వాడేసుకొంది. దీనిపై రాష్ట్రంలో సర్పంచ్‌లు మాకు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రాలు కూడా ఇచ్చారు.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో అమలుచేస్తున్న సంక్షేమ పధకాలకి తమపేర్లు పెట్టుకొని తమవని ప్రచారం చేసుకొంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద ఏపీకి 20 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ‘ఆయుష్మాన్ భారత్‌’ కార్డులని కూడా పేదలకి ఇవ్వడం లేదు.

వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఘోరంగా విఫలమైంది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు. ఏపీలో బిజెపి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అమరావతిని రాజధానిగా చేసి ఏపీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపుతుంది,” అని అన్నారు.

కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడల్లా ఏపీలో పెరుకుపోయిన సమస్యలని, జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలని, అనాలోచిత నిర్ణయాలని ఏకరువు పెట్టి ఈవిదంగా విమర్శించి వెళ్ళిపోతుంటారు తప్ప గాడి తప్పిపోతున్న ఏపీని గాడిలో పెట్టేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయరు. కానీ ఏపీలో బిజెపి అధికారంలోకి రావాలని కోరుకొంటారు.

ఈవిదంగా వ్యవహరిస్తున్నందుకే బిజెపికి మిత్రపక్షంగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కూడా విసుగెత్తిపోయి టిడిపితో పొత్తులు పెట్టుకొనేందుకు సిద్దం అవుతున్నారు. అయినా ఏపీ బిజెపి, కేంద్ర ప్రభుత్వాలకి ఏపీ వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. అంతా మొక్కుబడి మాటలు… కాలక్షేప రాజకీయాలే!

ADVERTISEMENT
Latest Stories