బీజేపీ శాసనసభా పక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా ఆయన పార్టీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. అదే సమయంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. తాజాగా ఆయన తన నియోజకవర్గంలో ఏ పార్టీలో చేరాలన్నదానిపై సొంతంగా సర్వే చేయించుకున్నారట.
[m9ad]
మీడియాతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. తనను కొన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. భవిష్యత్తే అన్నీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. కాగా ఆయన టిడిపి వైపు మొగ్గు చూపించవచ్చని కూడా ఆ మీడియా వెల్లడించింది. విష్ణుకుమార్ రాజు ఒక విలక్షణ రాజకీయ నాయకుడు. ఆయన ఎప్పుడు ఎవరు వైపు మాట్లాడతారో తెలీదు. శాసనసభలో చంద్రబాబు నాయుడును ఇంద్రుడు చంద్రుడు అని పొగిడే ఆయన ప్రెస్ మీట్లలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు.
అయినా ఆయన పై టీడీపీ నాయకత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందట. దీనితో ఆయన జాయిన్ కావడం లాంఛనమే కావచ్చు. మరోవైపు విష్ణు కుమార్ రాజు పార్టీలోకి తీసుకురావడానికి ఒకానొక సమయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నించారు. అయితే ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. శాసనసభా పక్ష నేతే వెళ్లిపోవడం అంటూ జరిగితే బీజేపీకి ఇబ్బందే. ఇటీవలే తెలంగాణాలో ఎంతో కొంత బలంగా ఉన్న బీజేపీలో సీనియర్లు కూడా ఓడిపోవడంతో ఇక్కడి బీజేపీ నేతలలో బెదురు మొదలయ్యిందట.



