ఏపీ బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి పార్టీ అధిష్టానం నుంచి నోటీస్ వచ్చింది. నిన్న ఆదివారం ఏబీఎన్ న్యూస్ ఛానలో ప్రసారమైన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె’ కార్యక్రమంలో 2019 ఎన్నికలలో తమ పార్టీ ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదని తాను ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలకు చెప్పానని విష్ణుకుమార్ రాజు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు రాష్ట్ర ప్రజలు బిజెపి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు.
వచ్చే ఎన్నికలలో ఏపీలో వైసీపీ ఓడిపోబోతోందని, టిడిపి నేతృత్వంలో కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. ఒకవేళ ఏపీని గాడిన పెట్టి మళ్ళీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తే ప్రజలు బిజెపిని క్షమిస్తారని లేకుంటే తీవ్రంగా నష్టపోతుందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తాను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నానని విష్ణుకుమార్ రాజు చెప్పారు.
విష్ణుకుమార్ రాజు చెప్పినవన్నీ వాస్తవాలే అని అందరికీ తెలుసు. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తితోనే ఆయన క్రమంగా బిజెపికి దూరమవుతున్నారు తప్ప పదవులు, టికెట్లు లభించలేదని కాదు. పార్టీకి దూరం అవుతున్నారంటే టిడిపికి దగ్గరవుతున్నారని బిజెపి అనుమానిస్తోంది. ఈ కార్యక్రమంలో విష్ణుకుమార్ రాజు వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన వ్యాక్యాలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలతో తాను చెప్పానని ఆయన చెప్పిన మాటలు పార్టీకి నష్టం కలిగించేవిగా ఉన్నందున సంజాయిషీ కోరుతూ బిజెపి అధిష్టానం సోమవారం ఆయనకు నోటీస్ పంపించింది.
పార్టీని, రాజకీయాలను పక్కనపెడితే విష్ణుకుమార్ రాజు కూడా ఏపీ పౌరుడే. రాష్ట్ర రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. నిజం నిఖార్సుగా మాట్లాడే ధైర్యం ఉన్న వ్యక్తి అని మంచి పేరుంది. అందుకే 2019 ఎన్నికలలో ఆయన శాసనసభకు మళ్ళీ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పటికీ తనతో సహా బిజెపిలో అందరూ ఓడిపోతారని నేరుగా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలకే ఆయన ధైర్యంగా చెప్పగలిగారు.
నిజానికి ఏ పార్టీకైనా ఇటువంటివారు చాలా అవసరం. కానీ దురదృష్టవశాత్తూ ప్రతీ పార్టీలో అధినేత భజన చేస్తూ పార్టీకి నష్టం చేకూర్చేవారే ఎక్కువగా ఉంటారు. ఏపీ బిజెపిలో కూడా ఇటువంటివారే ఎక్కువ ఉన్నారు. మోడీని చూసి ఏపీ ప్రజలు బిజెపికి ఓట్లేసి అధికారం కట్టబెట్టేస్తారని నమ్మబలికే అటువంటి నేతల కంటే, కొంపకు నిప్పు అంటుకొంది అందరం కలిసి మంటలు ఆర్పుకొందామని హెచ్చరించే విభీషణుడు వంటి విష్ణుకుమార్ రాజు వంటివారే అవసరం.
అయితే ఆయన కోట్లాదిమంది ప్రజలు చూస్తున్న టీవీ కార్యక్రమంలో బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో బిజెపి అధిష్టానం కూడా తప్పనిసరిగా స్పందించవలసివస్తోంది. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకొన్నప్పటికీ ఏపీలో పార్టీని కాపాడుకోవడానికి ఆయన చెపుతున్న మంచి మాటలను చెవిన వేసుకొంటే బిజెపికే మంచిది.



