విజయ్ ఆంథోనీ నటించిన ‘బిచ్చగాడు’ 2016లో విడుదలై సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్గా బిచ్చగాడు-2 చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర రాజధాని ముంబయిలో బిచ్చగాడు-3 జరిగింది. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు. నిజ జీవిత ఘటన. కానీ కథ మాత్రం ఇంచుమించు అలాంటిదే.
మహారాష్ట్రలో రూ.3,300 కోట్లు పైగా ఆస్తులు కలిగిన ప్రముఖ వ్యాపారవేత్త, బిజేపి ఎమ్మెల్యే పరాగ్ షా. ఆయన తన ఆధ్యాత్మిక జైన గురువు సూచన మేరకు, ఇటీవల బిచ్చగాడి వేషంలో ముంబై సమీపంలోని ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో కాలి నడకన తిరుగుతూ బిచ్చమెత్తుకున్నారు. ఒక రోజంతా బిచ్చమెత్తుకుంటూ, ఆ డబ్బుతో కడుపు నింపుకొని రోడ్డు పక్కనే పరాగ్ షా నిద్రపోయారు.
బిచ్చగాడి వేషంలో ఉన్న ఆయనని సామాన్య ప్రజలు గుర్తుపట్టలేదు. కనుక బిచ్చగాడితో ఏవిధంగా వ్యవహరిస్తారో ఆయనతో కూడా అదేవిధంగా వ్యవహరించారు.
మర్నాడు ఇంటికి చేరుకున్నాక అయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఒక్కరోజు దీక్ష వలన నాకు జీవితం దాని విలువ ఏమిటో బాగా అర్ధమైంది.
ఓ ధనవంతుడుగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా అందరూ నన్ను చూసే తీరుకి, ఓ బిచ్చగాడిగా నన్ను చూసే తీరుకి తేడా నాకు అర్దమైంది. ఇంతకాలం పదవి, డబ్బున్నవాడిని కనుక నేను చాలా గొప్పవాడిననే భావన నాలో ఉండేది. కానీ నేను ప్రజల ముందు చేయి చాపి అడుక్కుంటున్నప్పుడు, సామాన్య ప్రజలు కూడా నా కంటే ఉన్నతమైనవారనే విషయం అర్దమైంది.
నేను పొందుతున్న గౌరవ మర్యాదలు నన్ను చూసి కాదు… నా డబ్బు, పదవి, పరపతిని చూసి అని అర్థం చేసుకోగలిగాను. బిచ్చగాడిగా గడిపిన ఈ ఒక్కరోజు నా ఆలోచనా దృక్పదాన్ని సమూలంగా మార్చేసింది,” అని అన్నారు.
ఒకప్పుడు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచే మన దేశంలో యువ రాజులు గురువుల సేవ చేస్తూ, విద్యలు అభ్యసించే విధానం ఉండేది.
ఆ తర్వాత పట్టాభిషేకానికి ముందు తప్పనిసరిగా దేశాటన చేసేవారు. ఈ విధానం మన దేశంలో రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా కొనసాగేది.
దీని వలన వారికి లోకజ్ఞానంతో పాటు సామాన్య ప్రజల కష్టసుఖాలు, వారి అవసరాలు, సమస్యలు, బాధలు స్వయంగా అనుభవించి అర్థం చేసుకొనేవారు.
ఇప్పుడా అవసరం లేదు గనుక ముఖ్యమంత్రి కావాలనుకునేవారు పాదయాత్రలు చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజల సమస్యలు, అవసరాల గురించి తెలుసుకునే వారు ఎందరు? కనుక మన మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలకు కూడా ఇలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందేమో?





