వైసీపీ పాలనను, జగన్ విధానాలను ఆకాశానికి ఎత్తేస్తూ రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే అన్న విధంగా గడిచిన ఐదేళ్ల నుండి జగన్ భజన చేసిన కొన్ని బ్లూ మీడియాలు పోలింగ్ జరిగిన తీరును, నమోదైన ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకుని కౌంటింగ్ కు కొన్ని రోజుల ముందే కళ్ళు తెరిచి వాస్తవాన్ని గుర్తించినట్టుంది.
పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను నేరుగా గమనించి ముఖ్యమంత్రి పదవిని చేరుకున్న జగన్ ప్రజలకు దగ్గరగా ఉంటూ పాలన కొనసాగిస్తారని అందరు భావించారు. కానీ జగన్ ఆలోచనలు ఎవరి ఊహకు అందనివి అనేలా ప్రజలకు కాదు కదా కనీసం తన పార్టీ తరుపున నెగ్గిన ఎమ్మెల్యే లకు, ఎంపీ లకు కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వని స్థితికి చేరుకున్నారు జగన్.
అయితే ప్రజలకు మంచి చేస్తూ ఉంటే ఇక జగన్ వారిని వీరిని కలవాల్సిన అవసరం ఏముంది అంటూ దీని కూడా సమర్ధించిన బ్లూ మీడియా ఇప్పుడు వ్యతిరేకించడం చూస్తుంటే వైసీపీ ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. జగన్ ఓటమి వైస్సార్ కంచు కోట అయిన కడప జిల్లా నుంచే మొదలవ్వబోతుందని, ఇందులో
జగన్ పోటీ చేస్తున్న పులివెందుల కూడా ఉండబోతుందని సదరు నీలి మీడియా జగన్ ను హెచ్చరిస్తుంది.
వైస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన తమ్ముడు వివేకా కడప జిల్లా సమస్యలను తెలుసుకుంటూ అక్కడి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ జిల్లా మొత్తాన్ని వైస్సార్ కుటుంబానికి కంచుకోటలా మార్చుకున్నారు. కానీ జగన్ వైసీపీ పార్టీ పేరుతో రాజకీయం మొదలుపెట్టిన నాటి నుండి పరిస్థితిలు అందుకు భిన్నంగా మారిపోయాయి.
సొంత కుటుంబ సభ్యులైన వైస్సార్ కుటుంబాన్ని కాదని తన భార్య భారతి రెడ్డి బంధువులకు కడప జిల్లా బాధ్యతలు అప్పగించడం, వివేకా దారుణ హత్య ఇవన్నీ కూడా జగన్ కు కడప జిల్లాలో పట్టును కోల్పోయేలా చేశాయని సొంత మీడియా వారే గగ్గోలు పెడుతున్నారంటే కడప లో వైసీపీ పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్ధమవుతుంది.
జగన్ గడిచిన ఐదేళ్లలో బటన్ నొక్కడానికి తప్ప మరెప్పుడు తాడేపల్లి ప్యాలస్ గడప దాటి రాలేదని, జగన్ కు తెలిసినంతగా శత్రువులను పెంచుకోవడం మరెవరికి తెలియదని, పులివెందులలో కూడా ప్రజలలో జగన్ పై మంచి అభిప్రాయం లేదని, చివరికి కన్న తల్లి కూడా వైసీపీ కి ఓటు వేయొద్దు అనే స్థాయికి కుటుంబ సమస్యలను పెంచి పోషించారని ఇవన్నీ జగన్ స్వీయ తప్పిదాలే అంటూ వైసీపీ కి హిత బోధ చేసే ప్రయత్నం చేసింది.
అయితే జగన్ కు వ్యతిరేకంగా ఎవరు తన గళం వినిపించినా అది తల్లైన, చెల్లైనా కూడా బాబు మనిషే అంటూ వారికి పసుపు రంగు పూయడం పరిపాటిగా మారిన జగన్ కు, వైసీపీ కి ఇప్పుడు ఈ బ్లూ మీడియాను కూడా ఎల్లో మీడియాగా అభివర్ణిస్తారోమో చూడాలి మరి. కురుక్షేత్రంలో నేలకొరిగిన అభిమన్యుడిని కాదు పద్మ వ్యూహాన్ని ఛేదించిన అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ ను కర్ణుడితో పోలుస్తూ కర్ణుడు చావుకి కారణాలు అనేకం అలాగే జగన్ ఓటమికి స్వీయ తప్పిదాలు అనేకం అంటూ కథనాన్ని ప్రచురించారు వైసీపీ అనుకూల మీడియా.
బ్లూ మీడియానే జగన్ ఓటమిని నిర్దారిస్తూ విశ్లేషణలు మొదలు పెడితే ఇక టీడీపీ శ్రేణులు ఊరుతుంటారా..? ఇది “వెన్నుపోటు కాదు, గొడ్డలి వేటు కాదు, పెన్ను పోటు” అంటూ ఇక ఈ వీడియో ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వైసీపీ వారిని ఉడికిస్తున్నారు కూటమి మద్దతుదారులు. కౌంటింగ్ కు ముందే ఇలా జగన్ కు వ్యతిరేకంగా విశ్లేషణలు చేసి వైసీపీ వారి ఆత్మ స్తైర్యాన్ని దెబ్బకొట్టిన సదరు మీడియా వారిని చూసి సమయం చూసి కొట్టావు కదయ్యా అంటూ వైసీపీ శ్రేణులు నిస్టేజితులయ్యారు.






