గత కొన్ని రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బొండా ఉమా ఆయన చేసిన బంగీ జంప్ దృశ్యాలతో పాటు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించడంతో ఇక పార్టీ మారడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఉమ విజయవాడ తిరిగి రావడంతో ఏం చెయ్యబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఈరోజు ఉదయం బోండా ఉమతో ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చర్చలు జరిపారు. బోండా ఉమ పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో వీరిద్దరి మధ్య చర్చలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చంద్రబాబు దూతగా బుద్దా వెంకన్న చర్చలు జరిపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారే ప్రసక్తే లేదని బోండా ఉమ తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో పార్టీకి ఇంకా నమ్మకం కలగడం లేదు.
ఇటీవలే జరిగిన ఎన్నికలలో విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొండా కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మల్లాది విష్ణు ఈ స్థానం నుంచి అతి తక్కువ ఆధిక్యతతో గెలిచారు. దీనిపై బొండా ఉమా పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. రీకౌంటింగ్ డిమాండ్ చేసినా ఎన్నికల అధికారి అనుమతించలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కొట్టివేశారు. దీనితో బొండా ఉమ కేవలం మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.



