కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలలో మునిగిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలతో షాక్ అయిన మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలకు ‘జగనన్న పాఠాలు’ చెప్పిన తర్వాత తేరుకొని ఒకరొకరే మాట్లాడుతున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, “అమిత్ షా వచ్చి చెప్పేవరకు మా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు మీకు కనబడలేదా?అమిత్ షా వచ్చి చెప్పేవరకు మా ప్రభుత్వ వైఫల్యాలు మీకు కనిపించలేదా… జీవీఎల్ఎన్ గారూ?ఇంతకాలం మా అవినీతి, వైఫల్యాల గురించి తమరు ఎందుకు మమ్మల్ని ప్రశ్నించలేదు?అని అడిగారు.
అంటే మేము అవినీతికి పాల్పడటం నిజం. మా ప్రభుత్వం వైఫల్యం చెందటం కూడా నిజమే కానీ ఇంతకాలం మీరే అది గుర్తించలేకపోయారని అన్నట్లున్నాయి మంత్రి బొత్స మాటలు.
వైసీపీ అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని ఆనాడు జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యేకహోదా ఓ నిరంతర పోరాటమని, దానికి ఓ రూపం అంటూ ఉండదని మంత్రి బొత్స సెలవిచ్చారు. తెలంగాణ కావాలంటే కావాల్సిందే అని కేసీఆర్ పోరాడి సాధించుకొన్నారు. కానీ మోడీ మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేకహోదాకి ఆది అంతం, స్వరూపం ఉండని ఓ బ్రహ్మ పదార్ధమని బొత్స సెలవిస్తున్నారు!
ఏపీకి రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు, రెవెన్యూలోటు భర్తీకి నిధులు విడుదల చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏపీకి అధనంగా ఏమిచ్చిందని బొత్సవారు ప్రశ్నించారు.
అయితే ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంలాగా అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తూ, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తుంటే అందరూ సమర్ధించేవారు. కనీసం అమరావతి, పోలవరం నిర్మాణ పనులు కొనసాగిస్తూ వాటి కోసం కేంద్రాన్ని సాయం అర్ధించినా ఇవ్వకపోతే నిలదీసి అడగవచ్చు.
కానీ ఎంతసేపు అప్పులు, కేసుల గురించే మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు సాయం చేస్తుంది?అయినా తమ ప్రభుత్వం వైఫల్యాలను రాష్ట్ర బిజెపి నేతలు గుర్తించలేకపోయారని బొత్స వారే స్వయంగా చెప్పుకొంటున్నారుగా?మరెందుకు ఇంకా అనవసరపు ముచ్చట్లు?



