మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇది మీడియాలో వార్తగా వచ్చింది. ఇది కాస్త విచిత్రంగానే అనిపించినా ఇప్పుడు ఇలాంటి మెలో డ్రామా రాజకీయాలకు కూడా ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. కనుక మీడియా ఇలాంటివి కూడా వార్తగానే అందిస్తున్నాయి.
బొత్స మేనల్లుడు చిన్న శ్రీను అకస్మాత్తుగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపిలో చేరిపోయినందుకు బొత్స కన్నీళ్ళు పెట్టుకున్నారు. అయితే కొన్ని గంటల ముందే “ప్రతీ మనిషికి స్వార్ధం ఉంటుంది. ఎవరి దారి వారు చూసుకుంటారు. వైసీపీలోకి చాలా మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ఇందులో పెద్ద విచిత్రం ఏముంది? ఎవరు ఉన్నా లేకపోయినా వైసీపీ నడుస్తూనే ఉంటుంది,” అని పద్దతిగా, హుందాగా చెప్పారు.
కనుక ఇప్పుడు చిన్న శ్రీను వెళ్ళిపోయాడని బొత్స సత్యనారాయణ కన్నీళ్ళు పెట్టుకుంటే.. నిజమేనా? అని అనుమానం కలుగుతుంది.
చిన్న శ్రీను విజయనగరం జిల్లాలో తనకంటూ బలమైన క్యాడర్ని తయారు చేసుకున్నారు. ఇంతకాలం ఆయనతో పని చేసినవారితోనే బొత్స నేడు సమావేశమయ్యారు. అంటే వారందరూ చేజారిపోకుండా కాపాడుకోవాలనే ఆలోచనతోనే సమావేశమయ్యారు తప్ప ఇదేమీ సంతాప సభ కాదు కదా కన్నీళ్ళు పెట్టుకోవడానికి.
కానీ బొత్స మేనల్లుడైన చిన్న శ్రీను ఆయనకు చెప్పాపెట్టకుండా పార్టీకి రాజీనామా చేసి, టీడీపిలో చేరిపోయారంటే నమ్మశక్యంగా లేదు. బొత్స, చిన్న శ్రీను ఇద్దరి కుటుంబాల మద్య బంధుత్వం ఉంది. ఇద్దరూ విజయనగరంలోనే ఉంటారు. కనుక త్వరలోనే ఏదో ఓ సందర్భంలో కలుసుకోవడం ఖాయం. అప్పుడు కూడా వారు దూరదూరంగా ఉండిపోతే అప్పుడు తాపీగా బాధపడవచ్చు. అప్పుడు విజయనగర జనం కూడా అయన బాధను అర్థం చేసుకోగలరు. ప్రస్తుతం మాత్రం చిన్న శ్రీను వెంట వైసీపీ కార్యకర్తలు టీడీపిలోకి వెళ్ళిపోతారేమో? అనే ఆందోళనే కలగడం సహజం.
బొత్స సత్యనారాయణ కుటుంబం కూడా రేపు జనసేనలోనో లేదా విజయసాయి రెడ్డి పెట్టబోతున్న పార్టీలోకో జంప్ అయిపోతే అప్పుడు ఎవరు కన్నీళ్ళు పెట్టుకోవాలి?




