తెలంగాణలో బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మాకు ఎటువంటి సంబందమూ లేదని నిన్ననే మాజీ మంత్రి కేటీఆర్ గట్టిగా వాదించారు. అంతేకాదు… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తన పేరుని ప్రస్తావిస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖతో సహా మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఇది జరిగిన మర్నాడే ఈ వ్యవహారంతో బిఆర్ఎస్కు సంబందం లేదనలేని మరో రెండు పెద్ద సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చాయి.
ఒకటి రేవంత్ రెడ్డి-ఓటుకి నోటు కేసు. దానిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే ఆయనను ఆ కేసులో ట్రాప్ చేయగలిగారు. (అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా మొట్ట మొదటిసారిగా కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.)
రెండోది 2022 అక్టోబర్లో ముగ్గురు బీజేపీ ప్రతినిధులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ కేసులో బీజేపీ ప్రతినిధులను వలవేసి పట్టుకొని అరెస్ట్ చేయడం.
ఈ రెండు కేసులలో మీడియాతో సహా బిఆర్ఎస్ నేతలందరూ కేసీఆర్ తెలివితేటలను మెచ్చుకోగా, కేసీఆర్ కూడా మురిసిపోతూ ప్రెస్మీట్ పెట్టి వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకున్న సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.
కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే ఆ రెండు వ్యవహారాలు బయటపడ్డాయనే విషయం అప్పుడు ఎవరికీ తట్టలేదు. అందరి దృష్టి ఆ రెండు కేసులు, వాటిలో కేసీఆర్ చెప్పిన మాటలపైనే ఉండిపోయింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలద్రోయాలని ప్రయత్నిస్తే, ఆయన చాలా తెలివిగా బీజేపీ ప్రతినిధులంటే ట్రాప్ చేసి అరెస్ట్ చేయించి జైల్లో వేయించి మోడీ, అమిత్ షాలకు పెద్ద షాక్ ఇచ్చారంటూ మీడియా అభివర్ణించింది.
కానీ ఆనాడు ఫోన్లు ట్యాపింగ్ చేసి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో సిసి కెమెరాలు అమర్చి బీజేపీ ప్రతినిధులను ట్రాప్ చేసి పట్టుకున్నప్పుడు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, ఇంటలిజన్స్ డీఎస్పీ ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించారు.
వారిద్దరూ ఇప్పుడు వేరే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు, ఆనాటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కూడా మెల్లగా ఒకటొకటిగా బయటపడుతున్నాయి.
ఆనాడు బీజేపీ ప్రతినిధులను అరెస్ట్ చేసిన వెంటనే సిఎం కేసీఆర్ చాలా హుషారుగా ప్రెస్మీట్ పెట్టి అన్ని విషయాలు పూస గుచ్చిన్నట్లు వివరించడమే కాకుండా ఆ వీడియోలను దేశంలో ప్రముఖులందరికీ పంపించారు కూడా. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్కు సంబందం లేదనడానికి వీల్లేని అతిపెద్ద సాక్ష్యం ఇదే అని స్పష్టమవుతోంది.
నిన్న కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, 2022-23లో నాతో పాటు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో సహా రాష్ట్రంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని స్వయంగా చెప్పుకున్నారు కూడా. అప్పుడు కేసీఆరే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది కూడా ఈ కేసులో మరో సాక్ష్యమే అవుతుంది.
ఈ కేసులో నిందితుడుగా ఉన్న తెలంగాణ మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆయనను కూడా అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి పేర్లు బయటకు రావడం ఖాయం. కనుక ఈ కేసులో బయటపడుతున్న విషయాలు గమనిస్తే ఈ కేసు చివరికి కేసీఆర్ మెడకు చుట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.




