తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమిని సర్ధిచెప్పుకుంటూ ‘ప్రస్తుతం మా కారు గ్యారేజీకి వెళ్ళింది. తిరిగి రాగానే డబుల్ స్పీడుతో దూసుకుపోతుంది,” అని ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ కారు గ్యారేజి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
కారు గ్యారేజీలో ఉండగానే పలువురు బిఆర్ఎస్ పార్టీ మాజీ, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, జిల్లా అధ్యక్షులు తెలంగాణ భవన్ గోడ దూకి కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోతున్నారు.
ఆదివారం ఒక్కరోజే వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేశారు. వారిలో ఆరూరి రమేష్ బీజేపీలో చేరగా, మిగిలిన ఇద్దరూ సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం వచ్చేందుకు అవుటర్ వద్ద సిగ్నల్ కోసం ఎదురు చూసే రైళ్ళలా సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి అండ్ సన్స్, మల్లారెడ్డి అండ్ ఇన్లాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు సిగ్నల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం బిఆర్ఎస్ పార్టీలో సుమారు 10-15 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి, బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘సమయం లేదు మిత్రమా…’ అన్నట్లు బిఆర్ఎస్ నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముందు క్యూకడుతున్న తీరు చూస్తే, ఆ ఊహాగానాలు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
కనుక వీలైనంత త్వరగా కేసీఆర్ ఎవరూ ఊహించలేని పెద్ద ఎత్తు ఏదో వేయాలి. అలాంటి ఎత్తువేయగల ‘గేమ్ చేంజర్’ హైదరాబాద్ ఎవరూ లేరు. ఢిల్లీలోనే ఉన్నారు. కనుక నేడో రేపో బయలుదేరక తప్పదు. లేకుంటే గ్యారేజీలో ఉన్న కారు బయటకు రాక ముందే స్క్రాప్ అయిపోతుంది. ఒకవేళ బయటకు తోసుకువచ్చినా దానిలో తండ్రీ కొడుకులు మాత్రమే మిగులుతారు. అప్పుడు దానిని ఎవరు నడపాలో ఎవరు తోయాలో తెలీదు!




