అపర చాణక్యుడు, కాళేశ్వరం ప్రాజెక్టుని కూడా సొంతంగా డిజైన్ చేయగల మహా మేధావి అని పేరు గల కేసీఆర్ని తెలంగాణ ప్రజలు శాసనసభ ఎన్నికలలో తిరస్కరిస్తే, ఇప్పుడు పార్టీ నేతలు కూడా ఆయనను తిరస్కరించి బయటకు వెళ్ళిపోతున్నారు.
అంటే 3-4 నెలల వ్యవధిలో కేసీఆర్ రెండుసార్లు ఓడిపోయారన్న మాట! ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న కేసీఆర్ ఒకవేళ లోక్సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ ఓడిపోతే వరుసగా మూడుసార్లు ఓడిపోయి హ్యాట్రిక్ సాధించగలుగుతారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కేసుతో ఫినిషింగ్ టచ్ ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక కేసులు సిద్దం చేసి కేసీఆర్ మెడలో వేయబోతోంది. అంటే ‘విన్ అండ్ విన్’లాగ ‘ఫాల్ అండ్ ఫాల్’ అని అనుకోవచ్చన్న మాట.
శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది?అనే ప్రశ్నకు ఇప్పటికే మీడియా, రాజకీయ విశ్లేషకులు అనేక కారణాలు చెప్పారు. కనుక ఇప్పుడు ఆ చర్చ అప్రస్తుతం.
కానీ ఒక్క ఎన్నికలలో ఓడిపోగానే నేతలందరూ కేసీఆర్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు?అని ఆలోచించాల్సిన సమయం ఇది.
గతంలో కాంగ్రెస్, బీజేపీ, టిడిపి, వైసీపి, ఇంకా తమిళనాడులో డీఎంకె, అన్నాడీఎంకె వంటి అనేక పార్టీలు ఓడిపోయినా ఆటుపోట్లు తట్టుకొని నిలబడి మళ్ళీ పూర్వ వైభవం సాధించాయి. తాజాగా ఏపీలో టిడిపి, జనసేనలను గత ఐదేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఎంతగా వేదిస్తున్నప్పటికీ తట్టుకొని నిలబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిని నామరూపాలు లేకుండా చేసేందుకు జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పటికీ టిడిపి చెల్లాచెదురు అయిపోలేదు. త్వరలో జరుగబోయే ఎన్నికలలో వైసీపికి టిడిపియే ప్రధాన ప్రత్యర్ధిగా నిలుస్తోంది కదా?
ఇన్ని పార్టీలు ఓటమిని, అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలిగినప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు నిలబడలేకపోతోంది?ఒకే ఒక్క ఓటమితో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు చెల్లాచెదురు అయిపోతోంది? పార్టీ నేతలందరూ ఎందుకు కేసీఆర్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? అని ఆలోచిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఇస్తున్న బంపర్ ఆఫర్లు, వాటిని వద్దనుకుంటే కేసులే కారణమని చెప్పవచ్చు.
మరో కారణం ఏమిటంటే, ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఉద్యమాలతో సంబంధమే లేని అవకాశవాద రాజకీయ నాయకులతో నింపేసుకుని ఆ వాపును చూసి బలుపు అనుకుని భ్రమలో మునిగిపోవడమే.
దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఇంతకాలం కేసీఆర్ అహంభావాన్ని, నిరంకుశత్వాన్ని, ఆయన కుటుంబ సభ్యుల పెత్తనాన్ని, అవమానాలను అన్నిటినీ ఓపికగా భరించిన బిఆర్ఎస్ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తలుపులు తెరిచి ఆహ్వానిస్తుండటంతో వారు బిఆర్ఎస్ పార్టీలో నుంచి బయటపడేందుకు దారి దొరికింది కనుక వెళ్ళిపోతున్నారు.
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేసీఆర్ బెదిరించడం గమనిస్తే ఆయన అహంభావం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం అవుతోంది. ఈ అహంభావమే ఆయన కోరుకొని హ్యాట్రిక్ ఆయన చేత కొట్టించబోతోంది!
ఏపీలో వైసీపి, దాని అధినేత జగన్ తీరుతెన్నులను నిశితంగా గమనిస్తే, ఆయన కూడా కాస్త అటూ ఇటూగా కేసీఆర్ బాటల్లోనే సాగుతున్నట్లు అర్దమవుతుంది. కనుక నేడు కేసీఆర్ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని రేపు జగన్, వైసీపి కూడా ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది.
అయితే ఎన్నికలలో వైసీపి ఓడిపోతే, కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. ‘మేమందరం సిద్దం’ అని ఎలాగూ అంటున్నారు కూడా!




