
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరూ ఆంధ్రాకి తరలి వచ్చేసి ఇక్కడే రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం నేటికీ చంద్రబాబు నాయుడుని వదిలిపెట్టడం లేదు.
ఆయన కృష్ణా, గోదావరి నీళ్ళు దొంగిలించుకుపోతుంటే మేమే అడ్డుకొని తెలంగాణకు అన్యాయం జరుగకుండా కాపాడుతున్నామని బిఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాటలే ఇందుకు తాజా నిదర్శనం.
Also Read – ఉచితం సముచితం కాదు కానీ తప్పదుగా!
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కృష్ణా జలాలలో 74 శాతం నీళ్ళు ఏపీ వాడుకుంటోందని కెఆర్ఎంబీ ధృవీకరించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ వాటా నీళ్ళను కూడా వాడుకోలేక చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే చేతులు ముడుచుకొని చూస్తున్నారు.
ఆంధ్ర జల దోపిడీపై కాంగ్రెస్ మంత్రులు ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నారు. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38 శాతంపైగా నీటిని వాడుకున్నాము. తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోము. నీళ్ళ కోసం మరోసారి ఉద్యమిస్తాము,” అని అన్నారు.
Also Read – రాయలసీమ దశ తిరుగబోతోందా?
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వాడుకోలేక దిగువన ఆంధ్రాకు విడిచిపెట్టేస్తోందని ఆ నీటినే ఆంధ్రా వాడుకుంటోందని ఆయన మాటల్లోనే అర్దమవుతోంది. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో రహస్యంగా ప్రవేశించి అక్కడి నదులలో నుంచి నీళ్ళను దొంగిలించుకుపోతున్నారన్నట్లు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
బిఆర్ఎస్ పార్టీ మనుగడకు తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకుంటే ఆంధ్రాలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీ మనుగడ కోసం నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలనుకోవడమే చాలా తప్పు.
Also Read – వైసీపీ వేణు స్వామి ని ఆశ్రయించాలేమో..!
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపిలతో సహా మరే ఇతర పార్టీలు చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చెయ్యవు. ఒక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తుంటుంది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోకుండా తమ సొంత బలంతో తెలంగాణ రాజకీయాలలో బిఆర్ఎస్ పార్టీ నెగ్గుకు రాలేకపోవడం వారి బలహీనతే కదా?
తమ పార్టీ చాలా శక్తివంతమైనదని కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత గొప్పలు చెప్పుకుంటారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ళ తర్వాత కూడా నేటికీ బిఆర్ఎస్ పార్టీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకోవలసి రావడం ఆ పార్టీ దౌర్భాగ్యమే కదా?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కూడా బిఆర్ఎస్ పార్టీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరుని ఈవిదంగా ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని బిఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించాలనుకోవడం ఆ పార్టీ నేతలు అవమానంగా భావించకపోవడం ఇంకా సిగ్గుచేటు.