ఇప్పటికే వివేకా హత్యకేసు, లిక్కర్ స్కామ్ కేసులు వైసీపీ ఎంపీల మెడకు చుట్టుకోగా వాటిని విడిపించుకొని బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో కొత్త కేసు జగన్ సర్కారు మెడకు చుట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే… బైజూస్ ఈడీ కేసు.
ఆన్లైన్లో పాఠాలు అందించే బైజూస్ సంస్థ సీఈవో రవీంద్రన్పై ఈడీ కేసు నమోదు చేసింది. శనివారం ఈడీ అధికారులు బెంగళూరులోని ఆయన నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకొన్నారు. బైజూస్ సంస్థ విదేశాల నుంచి రూ.28,000 కోట్లు ప్రత్యక్ష పెట్టుబడులు సాధించింది. అయితే వాటికి సంబందించిన లెక్కలలో చాలా అవకతవకలున్నాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. విదేశాల నుంచి నిధులు సమకూర్చోకొనేందుకు బైజూస్ సంస్థ ఫెమా నిబందనలు ఉల్లంఘించిందని కనుక ఆ సంస్థపై దాడులు నిర్వహించామని ఈడీ తెలిపింది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకొంది. అయితే ఆ సంస్థ తాము పూర్తి ఉచితంగానే విద్యార్థులకు పాఠాలు అందిస్తున్నామని చెప్పుకొంటుంటే, జగన్ ప్రభుత్వం దాని కోసం సుమారు 750 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకోవడమే అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఆన్లైన్ పాఠాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్లు ఖర్చు చేసి 4.5 లక్షల ట్యాబ్స్ కొనుగోలు చేసి 8వ తరగతి విద్యార్థులకు అందించింది. అయితే జగన్ ప్రభుత్వం అకస్మాత్తుగా బైజూస్తో ఇంత భారీ ఒప్పందం చేసుకోవడం, దాని కోసం మరో రూ.500 కోట్లు ఖర్చు చేసి 4.5 లక్షల ట్యాబ్స్ కొనుగోలు చేయడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, భారీగా అవినీతి జరిగిందని టిడిపి ఆరోపిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థతో చేసుకొన్న ఒప్పందం, ట్యాబ్స్ కొనుగోలుకి సంబందించిన వివరాలను రహస్యంగా దాచిపెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ పేరుతో మొదట చాలా హడావుడి చేసినప్పటికీ, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నట్లే, బైజూస్ సంస్థ కూడా విద్యార్థులకు ఆన్లైన్లో బైజూస్ పాఠాలు ఇవ్వలేకపోతోందని సమాచారం.
ఒకవేళ బైజూస్ సంస్థ చెప్పుకొన్నట్లు విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ పాఠాలు ఇస్తున్నట్లయితే, అది ఏ కారణం చేత ఇవ్వలేకపోయినా దానిని తప్పుపట్టలేము కానీ ఏపీ ప్రభుత్వం బైజూస్ సంస్థతో రూ.750 కోట్లకు ఒప్పందం చేసుకొన్నామని చెప్పింది. కనుక ఆన్లైన్ పాఠాలు ఇవ్వకపోతే తప్పకుండా బైజూస్ అందుకు బాధ్యత వహించాలి.
ఒకవేళ బైజూస్ ఉచితంగా పాఠాలు ఇస్తున్నట్లయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చెల్లించామని అబద్దం చెప్పిందనుకోవలసి ఉంటుంది. అంటే ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళిన్నట్లు?ఇది ఇప్పుడు ఈడీ విచారణలో బయటపడే అవకాశం ఉంది. బైజూస్ ఆర్ధికలావాదేవీల రికార్డులన్నీ పరిశీలిస్తున్న ఈడీ, దాంతో ఏపీ ప్రభుత్వం చేసుకొన్న రూ.750 కోట్ల ఒప్పందం కూడా తప్పక పరిశీలిస్తుంది. ఒకవేళ ఈ ఒప్పందంలో ఏమైనా అవకతవకలు ఉన్నట్లు ఏదీ గుర్తిస్తే జగన్ సర్కారుకి కొత్త సమస్యలు తప్పవు…. జగన్ ప్రభుత్వం మెడకి బైజూస్ కేసు చుట్టుకొనే అవకాశం ఉంటుంది.



