వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తెచ్చిన నాటి నుండీ రాజధానికి భూములిచ్చిన రైతులు రోడెక్కారు. పెద్ద ఎత్తున నిరనస తెలుపుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు.
ఆయన్ను వెతికిపెట్టాలని పోలీసులకు.. రైతులు, కూలీలు ఫిర్యాదు చేశారు. “గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము’ అని ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు.
ఈ క్రమంలో నిరసనలలో కొంత మంది రైతులు ‘కరకట్ట కమల్ హస్సన్ కనిపించడం లేదు’ అంటూ బ్యానర్లు పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు. ఆళ్ల రామకృష్ణ రెడ్డి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటి విషయంలో చేసిన ఓవర్ యాక్షన్, అలాగే రైతు వేషం వేసి ఫేస్ బుక్ లో పెట్టే ఫోటోలకు ఆయన ఇచ్చే ఫోజులకు ఆయనకు కరకట్ట కమల్ హస్సన్ అని పేరు పెట్టారట.
ఇది ఇలా ఉండగా ఆందోళన చేస్తున్న రైతులను పలు చోట్ల పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. “మా పొలాలు నమ్మి మీకిస్తే వాటిని నాశనం చేసి దాన్ని అడ్డుకుంటే మమ్మల్నే కొడతారా ?? మా ఆవేదన చెప్పుకుంటుంటే పోలీసులతో కొట్టిస్తారా ? మా 29 గ్రామాలను కేంద్రపాలిత ప్రాంతం చెయ్యండి.. మేం ఆంధ్రప్రదేశ్ కి అక్కర్లేదు అనుకున్నప్పుడు, మాకు ఆంధ్రప్రదేశ్ అక్కర్లేదు,” అని కొందరు వాపోతున్నారు.



