అక్రమస్తుల కేసులో ఏ-1, ఏ-2లుగా సీబీఐ కోర్టులో కేసులను ఎదుర్కొంటున్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇద్దరూ షరతులతో కూడిన బెయిల్ పొంది బయట ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ షరతులలో భాగంగా వారిరువురూ విదేశీయాత్రలకు వెళ్ళాలంటే ముందుగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
సెప్టెంబర్ 2 నుంచి 12వరకు సిఎం జగన్ యూకె వెళ్ళేందుకు, ఆ తర్వాత విజయసాయి రెడ్డి యూకె, యూఎస్, జర్మనీ, సింగపూర్, దుబాయ్ పర్యటనలకు వెళ్ళేందుకు వేర్వేరుగా సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకొన్నారు. ఎప్పటిలాగే సీబీఐ న్యాయవాదులు వారిని అనుమతిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ పసలేని వాదనలు చేయగా, సీబీఐ కోర్టు ఆ వాదనలను తిరస్కరించి ఇద్దరికీ విదేశాలు వెళ్ళి వచ్చేందుకు అనుమతి మంజూరు చేసింది.
జగన్ దంపతులు యూకెలో చదువుకొంటున్న తమ కుమార్తెలవద్ద కొన్ని రోజులు గడిపి వచ్చేందుకు వెళుతుండగా, విజయసాయి రెడ్డి ఆయా దేశాలలో ప్రైవేట్ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకొనేందుకు విదేశాలు వెళుతునట్లు సమాచారం. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఓ ఎంపీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విదేశాలకు వెళ్ళేందుకు సీబీఐ కోర్టు తీసుకోవలసి రావడాన్ని ఏవిదంగా భావించాలో?
సిఎం జగన్ యూకె పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఏపీ శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇంచు మించు అదే సమయంలో 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కూడా జరుగబోతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకే అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని అప్పుడే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ శాసనసభ గడువు ముగిసిన తర్వాతే అంటే 2024 మార్చి-ఏప్రిల్ నెలల్లోనే ఎన్నికలకు వెళతామని వైసీపీ నేతలు చెపుతున్నప్పటికీ, ముందస్తు ఎన్నికలకు వెళ్లదలిస్తే సెప్టెంబర్లోనే శాసనసభను రద్దు చేసి ఈసీకి తెలియజేయవలసి ఉంటుంది. ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ లోక్సభ రద్దు చేస్తున్నట్లయితే, సిఎం జగన్ కూడా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా వెళ్లవచ్చు.



