సీబీఐకి ఎంత గొప్ప పేరు ఉందో అంత చెడ్డపేరు కూడా ఉందనేది అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా అనేక క్లిష్టమైన కేసులు చేదించినందుకుగాను అది సంపాదించుకొన్న మంచి పేరే దాని పట్ల ప్రజలలో ఇంకా గౌరవం, నమ్మకం మిగిల్చిందని చెప్పవచ్చు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా దర్యాప్తు జరపవలసిన సీబీఐ పాలకుల చేతిలో పావుగా మారిపోవడం వలన తన నిబద్దతను, పనితనాన్ని నిరూపించుకోలేకపోతోందని చెప్పుకోవచ్చు. కనుక పాలకులు గీసిన గీతల మద్యనే ముందుకు సాగుతూ అవసరమైనప్పుడు కేసులు పరుగులు పెట్టిస్తూ, వద్దన్నప్పుడు నిర్లిప్తంగా వ్యవవహరిస్తూ తనది కాని తప్పులకు విమర్శలు మూట గట్టుకొంటోంది.
ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసునే చూస్తే, ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవితను ఢిల్లీకి రప్పించి విచారణ చేస్తూ నేడో రేపో అరెస్ట్ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆమె పేరు కూడా ప్రస్తావించలేదు. ఈ కేసులో అరుణ్ పిళ్ళై బెయిల్ పిటిషన్పై నేడు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగినప్పుడు, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో అనేకసార్లు కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావిస్తూ ఆమెకు ఈ కేసులో కీలకపాత్ర పోషించారని, ఆమె బినామీయే అరుణ్ పిళ్ళై అని, కనుక ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ కోరింది.
ఇటీవల తెలంగాణ బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి-బిఆర్ఎస్ మద్య ఏదో రహస్య అవగాహన ఉందనే అనుమానం ప్రజలలో బలంగా ఉంది. లేదని నిరూపించేందుకు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది,” అని అన్నారు.
అంటే బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయాలని ఆయన సూచిస్తున్నట్లు అర్దమవుతోంది. అంటే నేరానికి పాల్పడినందుకు గాక, అధికార పార్టీ రాజకీయ అవసరాల ప్రకారం విచారణ, అరెస్టులు జరుగుతుంటాయని అర్దమవుతోంది. బహుశః అందుకే ఛార్జ్ షీట్లో కల్వకుంట్ల కవిత పేరును ఈడీ ప్రస్తావించి ఉంటే, నేడో రేపో ఆమెను మళ్ళీ విచారణకు పిలిపించే అవకాశం ఉందని భావించవచ్చు.
ఇదేవిదంగా, వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విచారణలో తమకు సహకరించడంలేదని, తప్పనిసరిగా అరెస్ట్ చేసి విచారణ జరపాల్సి ఉంటుందని హైకోర్టుకు పదేపదే చెప్పిన సీబీఐ, ఆయనను ఎందుకు పిలుస్తుందో, ఎందుకు విరామం ఇస్తుందో దానికే తెలియాలి. ఈ కారణంగా అటు వైసీపీ, ఇటు ప్రతిపక్షాలు కూడా సీబీఐనే నిందిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావిస్తూ బిఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెట్టిన్నట్లే, వివేకా హత్య కేసులో సిఎం జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించి వైసీపీని టెన్షన్ పెట్టడం గమనార్హం.
అయితే రెండు కేసులలో పురోగతి ఏమైనా ఉందా?ఎప్పటికైనా దోషులకు శిక్ష పడేలా చేయగలదా?అంటే ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే, సీబీఐ విచారణకు, రాజకీయలకు కనబడని లింక్ ఏదో ఉన్నందునే. ఓ కేసులో ఫలానా వ్యక్తి నేరం చేశాడని సీబీఐ గట్టిగా నమ్ముతున్నప్పటికీ ఏమీ చేయలేని నిసహాయత, సీబీఐకి చెడ్డపేరు తెస్తోందని చెప్పొచ్చు. కానీ ఈ రాజకీయ ఒత్తిళ్ళ నుంచి సీబీఐ ఎప్పటికీ బయటపడలేదు కనుక దాని విచారణ కూడా ఇలాగే మూడడుగులు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగిపోతుంటుంది. ఇదే నిందితులకు ఊరట కలిగించే విషయం. అందుకే నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. పదవులు, అధికారం అనుభవిస్తూ దర్జాగా జీవించగలుగుతున్నారు.
CBI Kavitha Delhi Liquor scam



