ఈ మధ్య కాలంలో పరిస్థితులు చూస్తుంటే జైలుకెళ్లోచ్చిన రాజకీయ నాయకులకు ప్రజలలో క్రేజ్ పెరుగుతున్నట్టుంది. “జైలు కెళ్ళు ముఖ్యమంత్రి పదవి పట్టు” అన్నట్టుగా ప్రజలు జైలు జీవితం అనుభవించిన రాజకీయ నేతలనే తమ నాయకులుగా ఎన్నుకునే ట్రెండ్ కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో.
2012 లో జగన్ సిబిఐ పెట్టిన అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు 16 నెలల పాటు చంచల్ గూడా జైలులో గడిపారు. 2014 ఏపీలో జరిగిన ఎన్నికలలో స్వల్ప ఓటు శాతంతో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. A1 గా ప్రత్యర్థుల చేత విమర్శలు ఎదుర్కొన్న జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో ఏపీలో ప్రభుత్వాన్ని స్థాపించారు.16 నెలల జైలు జీవితంతో ప్రజలలో సింపతీ సంపాదించి జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు.
ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే.., 2015 లో ఓటుకు నోటు కేసులో అరెస్టయ్యి నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో గడిపారు రేవంత్ రెడ్డి. 2018 ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెంది 2019 ఎన్నికలలో మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించారు. అలాగే 2021 లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్ష్యుడిగా ఎంపికయ్యి 2023 ఎన్నికలలో రాష్ట్రంలో పార్టీ జెండా ఎగరేసి ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు.
ఇలా జైలుకెళ్లోచ్చిన రాజకీయ నాయకులను “ఖైదీ టూ ముఖ్యమంత్రి”ని చేస్తున్నారు తెలుగు ప్రజలు. ఒకప్పుడు కాలం కలిసిరాక పొతే జైలుకు పోవడమే అనే భావన ఉండేది కానీ ఇప్ప్పుడు జైలు కెళ్లిన రాజకీయ నాయకుడికి ఇక మహర్దశ పెట్టినట్టే అనే నానుడి రుజువవుతోంది. చంద్రబాబు విషయంలో కూడా ఇదే రుజువయ్యింది. ఎప్పుడు ప్రజలు మధ్య ఉండే నాయకుడిగా గుర్తింపు ఉన్న బాబు ఒక్కసారిగా దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉండడం ప్రజలకు, పార్టీ నేతలకు దూరమవడంతో బాబుని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తి ప్రజలలో పెరిగింది.
దీని ఫలితమే బాబు బయటకు రాగానే దక్కిన ప్రజాదరణ.ఇప్పటికి అది కొనసాగుతూనే ఉంది. ఇంతకు మునుపు కన్నా ప్రజలలో బాబుకి పెరిగిన ప్రజాదరణ చూస్తుంటే జగన్, రేవంత్ మాదిరే ఈ సారి చంద్రబాబు ముఖ్యమంత్రి కానున్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. “ఖైదీ టూ సీఎం: జైలు వాస్తు బాగున్నట్టుంది” మా నాయకుడిని కూడా ఏదోఒక కేసు పెట్టి జైలుకు పంపండి సార్..! అప్పుడే ప్రజలు నమ్మి ఓటేస్తారేమో అంటూ వేడుకుంటున్నారు పవన్ అభిమానులు కూడా.




