తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తే, సునీల్ కనుగోలు తెర వెనక ఎన్నికల వ్యూహాలు రచిస్తూ పార్టీకి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ ఎన్నికలలో కేసీఆర్ని వారిరువురూ ఓడించగలిగారా లేదా అనే విషయం రేపు ఎన్నికల ఫలితాలు వెలువడితే తేలిపోతుంది. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయినా వారిరువురూ కలిసి ఈ ఎన్నికలలో కేసీఆర్ అంతటివాడికి చుక్కలు చూపించారనేది మాత్రం వాస్తవం.
టిడిపి, జనసేనలు కూడా సునీల్ కనుగోలు సేవలు తీసుకోవడం చాలా అవసరమనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఉండగా మరొకరు మాకెందుకు? అని టిడిపి, జనసేన నేతలనుకోవచ్చు. కానీ తెలంగాణలో కేసీఆర్ కూడా నేను ఉండగా ప్రశాంత్ కిషోర్ మాకెందుకు అని అనుకొన్నారు. కేసీఆర్ ఉన్నారనే ధీమాతో బిఆర్ఎస్ నేతలు ముందుకు వెళ్ళారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్ నిజమనుకొంటే, కేసీఆర్తో సహా అందరూ కాంగ్రెస్తో ఎదురుదెబ్బ తినబోతున్నారు.
కనుక టిడిపి, జనసేనలు సునీల్ కనుగోలు సేవలు తీసుకోవడం మంచిదే అని చెప్పవచ్చు. వైసీపి వెనుక లక్షలాది మంది వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వైసీపి చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది. వైసీపికి ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐప్యాక్ ఎన్నికలలో మళ్ళీ సాయపడుతోంది కూడా. వైసీపి ధనబలం, అంగబలం గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వైసీపి ప్రభుత్వం, ఆ పార్టీ అనుసరిస్తున్న ఎత్తులు, నక్క జిత్తులను చూస్తున్నప్పుడు, టిడిపి, జనసేనలు నేరుగా వెళ్ళి దానితో తలపడితే అది వాటిని చావు దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కనుక టిడిపి, జనసేనలు చేతులు కలిపితే సరిపోదు. వాటికి బీజేపీ తోడైనా సరిపోదనే చెప్పాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి తాను సింహానన్ని గొప్పగా చెప్పుకొంటున్నారు కూడా. కనుక ఆ సింగిల్ సింహాన్ని ఓడించాలంటే, తెలంగాణలో కాంగ్రెస్ అమలుచేసిన అద్భుతమైన ఎన్నికల వ్యూహాలు… వాటిని రూపొందించిన సునీల్ కనుగోలు కూడా టిడిపి, జనసేనలకు చాలా అవసరమే.




