ఒకరు మాజీ ముఖ్యమంత్రి మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి గతాలే ఉంటాయి. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రికి గతం, వర్తమానం, భవిష్యత్ మూడూ ఉంటాయి.
ఉదాహరణకు పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాల గురించి చెప్పుకోగలరు. పదేళ్ళ తన పాలనలో రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారో చెప్పుకోగలరు. మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే ఏమి చేయగలరో కూడా చెప్పుకోవచ్చు.
అలాగే సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయని అందరికీ తెలుసు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా ఇటువంటి గొప్ప అవకాశమే ఉంది. కానీ ఈ 5 ఏళ్ళలో రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదు. కనుక ఆయన ప్రసంగాలలో కూడా ‘అభివృద్ధి’ ఉండదు.
ప్రత్యేక హోదా కోసం చేసిన ఉత్తుత్తి పోరాటాలు ఉన్నాయి. కానీ వాటి గురించి ఇప్పుడు మాట్లాడితే కొంప మునుగుతుంది. అందుకే ‘ప్రత్యేక హోదా’పై మాట్లాడేందుకు పూర్తి పేటెంట్ హక్కులు చెల్లెమ్మ పుచ్చేసుకొని గలగల మాట్లాడేస్తోంది.
ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదు. అభివృద్ధి, సంక్షేమ పధకాలు రెండూ డిఫరెంట్ అని గ్రహించేసరికే ఎన్నికలు వచ్చేశాయి. కనుక ఎన్నికల గంట మ్రోగేలోగా హడావుడిగా నాలుగైదు శంకుస్థాపనలు చేసి, అరచేతిలో వైకుంఠం చూపించాలనుకున్నా ప్రజలు నమ్మరు. కనుక అరిగిపోయిన రికార్డులా సంక్షేమ పధకాలతో ‘చేసిన మేలు’ గురించి మాత్రమే జగన్ చెప్పుకోవలసి వస్తోంది.
నేడు విజయనగరం జిల్లా బొండపల్లి ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగంలో చదువులు, కాలేజీలు, ఉద్యోగాలు, జాబ్ క్యాలండర్, మెగా డీఎస్సీ, పరిశ్రమలు, ఐటి కంపెనీల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఈ నాలుగు ముక్కలు వినేందుకే కదా ఇన్నాళ్ళు ఎదురుచూసింది అని అందరూ అనుకోకుండా ఉండలేరు.
ఓ ముఖ్యమంత్రి నోట వినాల్సిన ఈ మాటలు 75 ఏళ్ళు వయసున్న ఓ ప్రతిపక్ష నాయకుడు నోట వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తూ, మాట్లాడుతుంటే, చిన్న పిల్లోడో యువకుడో ఇంకా తేల్చుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి నోట నిత్యం మేలు, కుట్రలు, తోడేళ్ళ గుంపు, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించే వినిపిస్తుంటుంది.
ఒక విజనరీకి, అది లేని మరో నాయకుడి మాటలకు మద్య కనిపిస్తున్న ఈ చిన్న తేడా చూస్తే తెలుస్తోంది కదా రాష్ట్రానికి ఎవరు అవసరమో?




